SRINIVASA KALYANAM ENTHRALL DENIZENS OF ERNAKULUM _ ఎర్నాకుళంలో వైభవంగా శ్రీనివాస కల్యాణం
ఎర్నాకుళంలో వైభవంగా శ్రీనివాస కల్యాణం
తిరుపతి, ఏప్రిల్ 20, 2013: తిరుమల తిరుపతి దేవస్థానం మొట్టమొదటిసారిగా కేరళ రాష్ట్రంలో తలపెట్టిన శ్రీనివాస కల్యాణాల్లో భాగంగా శనివారం సాయంత్రం ప్రసిద్ధి చెందిన ఎర్నాకుళం నగరంలో స్వామివారి కల్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. ఇక్కడి టిడిఎం హాల్ పక్కన గల శివాలయం మైదానంలో నిర్వహించిన శ్రీవారి కల్యాణానికి సుమారు 50 వేల మంది భక్తులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా తితిదే తిరుపతి సంయుక్త కార్యనిర్వహణాధికారి శ్రీ పి.వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ శ్రీవారికి అపరభక్తుడైన కులశేఖర ఆళ్వార్ జన్మించిన కేరళ రాష్ట్రంలో శ్రీవారి కల్యాణం నిర్వహించడం ఆనందదాయకమన్నారు. హిందూ సనాతన ధర్మ ప్రచారంలో భాగంగా తిరుమల తిరుపతి దేవస్థానం ఏడేళ్ల క్రితం స్వామివారి కల్యాణాలను ప్రారంభించినట్టు తెలిపారు. రాష్ట్రంలోని జిల్లా కేంద్రాల్లో మాత్రమే గాకుండా మిగిలిన రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో, విదేశాల్లోనూ ”శ్రీనివాస కల్యాణం” పేరిట ఈ కల్యాణాలు నిర్వహిస్తోందన్నారు. ఈ కార్యక్రమంతో హైందవ ధర్మ పరిరక్షణతోపాటు సమాజంలో భక్తిభావాన్ని పెంచుతోందని, ఆధ్యాత్మిక విలువలను కూడా తితిదే ప్రచారం చేస్తోందని చెప్పారు. సుదూర ప్రాంతాల నుండి తిరుమలకు రాలేని భక్తులకు స్వామి, అమ్మవార్ల కల్యాణాన్ని కనులారా వీక్షించే భాగ్యాన్ని తితిదే కల్పిస్తోందన్నారు. శ్రీవారి కల్యాణంతో స్వామివారి ఆశీస్సులు ప్రజలందరికీ అందాలని జెఈవో ఆకాంక్షించారు.
కాగా శనివారం సాయంత్రం 6.00 గంటలకు స్వామివారి కల్యాణోత్సవం ప్రారంభమైంది. ప్రధాన అర్చకులు శ్రీ బాలాజి స్వామి తన శిష్యబృందంతో కలిసి యజమాని సంకల్పం, భక్త సంకల్పం, మహాసంకల్పం, మంగళసూత్రధారణ ఘట్టాలతో వేదమంత్రాలు పఠిస్తూ శాస్త్రోక్తంగా స్వామివారి కల్యాణాన్ని నిర్వహించారు.
అంతకుముందు జెఈవో ఉదయం గురువాయూర్లోని తితిదే కల్యాణమండపాన్ని సందర్శించారు. అక్కడ చేపట్టాల్సిన మరమ్మతులపై ఆయన ఇంజినీరింగ్ అధికారులతో సమీక్ష నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రివర్యులు శ్రీ కె.వి.థామస్, జస్టిస్ కె.ఆర్.రామన్, జస్టిస్ ఆర్.భాస్కరన్, జస్టిస్ పి.ఎన్.రవింద్రన్, జస్టిస్ ఎల్.విశ్వనాథ అయ్యర్, తితిదే చీఫ్ లైజన్ ఆఫీసర్ శ్రీ వెంకటశర్మ, శ్రీ కల్యాణోత్సవం ప్రాజెక్టు ప్రత్యేకాధికారి డాక్టర్ కె.రామకృష్ణ, అసిస్టెంట్ ఇంజినీర్ శ్రీ అమరనాథరెడ్డి, శ్రీవారి సేవ ట్రస్టు నిర్వాహకులు, జిల్లా అధికారులు, విశేషసంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
ఎర్నాకుళం నుండి తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.