Adhikara Nandi Vahanam _ అధికారనంది వాహనంపై సోమస్కందమూర్తి

అధికారనంది వాహనంపై సోమస్కందమూర్తి

తిరుపతి, మార్చి 7, 2013: తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో ఐదో రోజైన గురువారం ఉదయం సోమస్కందమూర్తి అధికారనంది వాహనంపై భక్తులకు కనువిందు చేశారు. వాహనసేవ ఆలయం నుండి మొదలై కపిలతీర్థం రోడ్‌, అన్నారావు సర్కిల్‌, వినాయక నగర్‌ ఎల్‌ టైప్‌ క్వార్టర్స్‌, హరేరామ హరేకృష్ణ గుడి, ఎన్‌జిఓ కాలనీ, అలిపిరి బైపాస్‌ రోడ్‌ మీదుగా తిరిగి ఆలయానికి చేరుకుంది. భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించారు. భక్తజన బృందాల చెక్కభజనలు ఆకట్టుకున్నాయి.
కపిలేశ్వరస్వామి వాహనసేవలలో విశిష్టమైనది అధికారనంది. ఈ అధికారనందికి నామాంతరం కైలాసనంది. కైలాసంలో మెడలో మువ్వలదండలతో, కాళ్లకు గజ్జెలతో మనోహరాకారంతో, బంగారుకొమ్ములతో అలరారే నంది భవుడికి నిత్యవాహనం.
అనంతరం ఉదయం 9.00 గంటల నుండి 11.00 గంటల వరకు అర్చకులు స్నపన తిరుమంజనం ఘనంగా నిర్వహించారు. శ్రీ స్కోమస్కందమూర్తి, శ్రీ కామాక్షి దేవి అమ్మవారికి పాలు, పెరుగు, తేనె, పండ్లరసాలు, చందనంతో అభిషేకం చేశారు.
సాయంత్రం 6.30 గంటల నుండి రాత్రి 8.30 గంటల వరకు తిరుచ్చి ఉత్సవం వైభవంగా జరుగనుంది. శివచించన కోసం కొందరు పర్వతగుహలలో ఒంటరిగా హఠయోగాభ్యాసం చేస్తున్నారు. మరికొందరు శీతాకాలంలో గంగాజలాలలో దిగి తపమాచరిస్తున్నారు. ఇంకొందరు గ్రీష్మకాలంలో పంచాగ్ని మధ్యలో ఒంటికాలి మీద నిలిచి ఘోర తపస్సు ఆచరిస్తున్నారు. ఈ ప్రయత్నాలన్నీ తమ చిత్తసరోజాలను పరమేశ్వరార్పణ చేయడానికే. కానీ మహాదేవుడైన కపిలేశ్వరస్వామికి బ్రహ్మోత్సవవేళ ఈ తిరుచ్చి వాహనంపై దర్శిస్తున్న భక్తుల చిత్తం అయత్నంగా పరమశివ పదాయత్తమవుతుంది.

ఈ కార్యక్రమంలో కపిలేశ్వరాలయ సూపరింటెండెంట్‌ శ్రీ సురేష్‌రెడ్డి, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్‌ శ్రీ కె.శ్రీనివాసులు, ఇతర అధికారులు, పెద్దసంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.

On the 5rd day of Ongoing Brahmotsavam in TTDs Sri Kapileswara Swamy Temple, the processional deity of Lord Kapileswara Swamy along with Goddess Parvathi were taken out in procession on ‘ADHIKARA NANDI VAHANAM’ in Sri Kapileswara Swamy Temple in Tirupati on Thursday morning.