ADHYANOTSAVAMS CONCLUDES _ శ్రీవారి ఆలయంలో ముగిసిన అధ్యయనోత్సవాలు

TIRUMALA, 05 JANUARY 2024: The 25 day Adhyayanotsavams concluded in Tirumala on a grand religious note with Tanniramudu event on Friday evening.

After Sahasra Deepalankara Seva, the deities reached Vahana Mandapam where in the successor of Tirumala Nambi brought Akasa Ganga Waters amidst chanting of hymns.

Later they reached Tirumala temple and offered the sacred waters to the lotus feet of the presiding deity of Sri Venkateswara chanting Tirumozhi Pasurams.

On Saturday evening, Sri Malayappa along with His consorts visit Tirumala Nambi temple located in the South Mada street.

Both the senior and junior Pontiffs of Tirumala, Temple officials participated.

ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

శ్రీవారి ఆలయంలో ముగిసిన అధ్యయనోత్సవాలు

తిరుమల, 2024 జ‌న‌వ‌రి 05: తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారి ఆలయంలో గ‌త ఏడాది డిసెంబర్ 12వ తేదీ నుండి 25 రోజుల పాటు జరిగిన అధ్యయనోత్సవాలు శుక్ర‌వారం ముగిశాయి. ఈ సందర్భంగా ఆలయంలోని రంగనాయకుల మండపంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారిని వేంచేపు చేసి దివ్యప్రబంధ గోష్టి నిర్వహించారు.

గత 25 రోజులుగా శ్రీవారి ఆలయంలో శ్రీవైష్ణవ జీయంగార్లు 12 మంది ఆళ్వార్లు రచించిన దివ్యప్రబంధ పాశురాలను గోష్ఠిగానం ద్వారా ప్ర‌తి రోజు స్వామివారికి నివేదించారు. ఆళ్వార్‌ దివ్యప్రబంధంలోని 4 వేల పాశురాలను పారాయణం చేశారు.

శుక్ర‌వారంనాడు అధ్యయనోత్సవాల్లో చివరిరోజు కావడంతో ”తన్నీరముదు” ఉత్సవం నిర్వహించారు. అధ్యయనోత్సవాలు ముగిసిన అనంతరం మరుసటిరోజు అనగా జ‌న‌వ‌రి 6న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారు దక్షిణ మాడ వీధిలోని శ్రీ తిరుమలనంబి ఆలయానికి వేంచేస్తారు.

ఘనంగా ”తిరుమలనంబి తన్నీరముదు” ఉత్సవం

శ్రీ వైష్ణవ భక్తాగ్రేసరుడు, శ్రీవేంకటేశ్వరుని సేవలో తన జీవితాన్ని అర్పించిన మహనీయుడైన శ్రీ తిరుమలనంబి స్మృత్యర్థం ప్రతి ఏడాదీ నిర్వహించే ”తన్నీరముదు” ఉత్సవం తిరుమలలో శుక్ర‌వారం ఘనంగా జరిగింది. సాయంత్రం సహస్ర దీపాలంకార సేవ అనంతరం శ్రీ మలయప్పస్వామివారు తిరుమాడ వీధి ఆలయ ప్రదక్షిణముగా వాహన మండపానికి వేంచేపు చేస్తారు. తిరుమలనంబి ఆలయం నుండి ప్రదక్షిణ‌గా తిరుమలనంబి వంశీకులు శిరస్సుపై బిందెలతో ఆకాశగంగ తీర్థాన్ని వాహన మండపానికి తీసుకొస్తారు. అనంతరం వేదమంత్రోచ్ఛారణ నడుమ జీయర్‌ స్వాములు, ఆచార్య పురుషులు, ప్రబంధ పండితులు పవిత్ర తీర్థజలంతో ఆలయంలోకి వేంచేపు చేశారు.

అనంతరం ఆల‌య అర్చ‌కులు స్వామివారి మూలవిరాట్టు పాదాలపై అమరి ఉన్న బంగారు తొడుగునకు పవిత్ర ఆకాశగంగ జలంతో అభిషేకం చేశారు. ఈ సందర్భంగా తిరుమలనంబి రచించిన ”తిరుమొళి పాశురాలను” పారాయణం చేశారు.

ఈ కార్య‌క్ర‌మంలో తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్ద జీయర్ స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్న జీయర్ స్వామి, టీటీడీ అధికారులు పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.