”ADIBHATLA IMMORTALISED HARIKATHA”-KALATAPASVI Dr K VISWANATH _ హరికథకు ప్రాణం పోసిన ఆదిభట్ట : శ్రీ కాశీనాధుని విశ్వనాథ్
హరికథకు ప్రాణం పోసిన ఆదిభట్ట : శ్రీ కాశీనాధుని విశ్వనాథ్
తిరుపతి, సెప్టెంబరు 04, 2013: సంగీతం, సాహిత్యం, నృత్యం లాంటి సంప్రదాయకళల మేళవింపుతో హరికథకు ప్రాణం పోసిన మహనీయుడు శ్రీ ఆదిభట్ట నారాయణదాసవర్యులు అని ప్రముఖ తెలుగు చలనచిత్ర దర్శకులు శ్రీ కాశీనాధుని విశ్వనాథ్ అన్నారు. హరికథా పితామహుడు శ్రీ ఆదిభట్ట నారాయణదాసవర్యుల 149వ జయంతి ఉత్సవాల్లో భాగంగా ఆయన శిలావిగ్రహావిష్కరణ కార్యక్రమం బుధవారం తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర సంగీత, నృత్య కళాశాలలో ఘనంగా జరిగింది. శ్రీ విశ్వనాథ్ ముఖ్య అతిథిగా హాజరై నారాయణదాసవర్యుల విగ్రహాన్ని ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆదిభట్ట వారు హరికథల ద్వారా భక్తి సాహిత్యాన్ని, హైందవ ధర్మాన్ని విస్తృతంగా వ్యాప్తి చేశారని, సంగీత కళాశాల విద్యార్థులు ఆయన్ను స్ఫూర్తిగా తీసుకుని అడుగుజాడల్లో పడవాలని సూచించారు. సంప్రదాయ కళలంటే తనకు ఎంతో భక్తి, ఇష్టమని, శ్రీ వేంకటేశ్వరుని పాదాల చెంత జరిగే కార్యక్రమాలకు ఎన్నిసార్లు పిలిచినా కాదనకుండా వచ్చేస్తానని అన్నారు. తిరుపతి నగరానికి అద్వితీయమైన ఆకర్షణ ఉందని, అందునా ఎస్వీ సంగీత కళాశాల ప్రాంగణంలో అడుగడుగునా సప్తస్వరాలు మారుమోగుతుంటాయని పేర్కొన్నారు. ఆదిభట్ట లాంటి మహనీయుడి దర్శనం జీవితంలో కాలేదన్న బాధ ఆయన విగ్రహావిష్కరణ ద్వారా తీరిందన్నారు. సంప్రదాయ కళల్లో ఉన్న గొప్పదనాన్ని ప్రతి చిత్రంలోనూ తనకు చేతనైన రీతిలో చూపానని తెలిపారు. ముఖ్యంగా తన తొలిచిత్రం ‘ఓ సీత కథ’లో ముఖ్య పాత్ర హరికథ నేపథ్యంలోనే సాగుతుందన్నారు. ఇక్కడ నెలకొల్పిన ఆదిభట్ట వారి సజీవ విగ్రహం ఆయన నిజంగానే హరికథ చెబుతున్న దివ్యానుభూతిని కలిగిస్తోందన్నారు.
తితిదే కార్యనిర్వహణాధికారి శ్రీ ఎం.జి.గోపాల్ మాట్లాడుతూ నారాయణదాసవర్యులను నడిచే విశ్వవిద్యాలయంగా అభివర్ణించారు. విశ్వనాథ వారు తమ చలనచిత్రాల ద్వారా సంప్రదాయ కళలు, భారతీయ సంస్కృతి, సంప్రదాయాల విశిష్టతను చాటి చెప్పారని వివరించారు. అందుకే విశ్వనాథ చేతులమీదుగా ఆదిభట్ట విగ్రహావిష్కరణ చేయించినట్టు తెలిపారు. ఆదిభట్ట వారు తనను తాను తెలుసుకునే ప్రయత్నంలో ఎవ్వరూ అందుకోలేని స్థానానికి చేరుకున్నారని వివరించారు. సంగీత కళాశాలలోని హరికథ విభాగం అభివృద్ధికి తితిదే తరఫున అన్ని సహాయ సహకారాలు అందిస్తామని ఈవో తెలిపారు.
అంతకుముందు తితిదే ముద్రించిన ”శ్రీనివాస కల్యాణం” అనే హరికథ గ్రంథాన్ని శ్రీ విశ్వనాథ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా శ్రీ విశ్వనాథ్ను శాలువ, శ్రీవారి ప్రసాదాలు, చిత్రపటంతో ఈవో సన్మానించారు. సన్మానం అందుకున్న వారిలో ఆదిభట్ట విగ్రహాన్ని రూపొందించిన శిల్పి శ్రీ ఆకెళ్ల సత్యమారుతిరావు, ఈవో, జెఈవో ఉన్నారు.
ఈ కార్యక్రమంలో తితిదే తిరుమల సంయుక్త కార్యనిర్వహణాధికారి శ్రీ కె.ఎస్.శ్రీనివాసరాజు, ముఖ్య నిఘా మరియు భద్రతాధికారి శ్రీ జివిజి.అశోక్కుమార్, విద్యాశాఖ అధికారి శ్రీ శేషారెడ్డి, సంగీత కళాశాల ప్రిన్సిపాల్ శ్రీమతి చల్లా ప్రభావతి, హరికథా విభాగాధిపతి శ్రీ సింహాచలశాస్త్రి, ఇతర అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది