BLOOD DONATION CAMP _ యువత స్వచ్ఛందంగా రక్తదానం చేయాలి : తితిదే ఈవో
యువత స్వచ్ఛందంగా రక్తదానం చేయాలి : తితిదే ఈవో
తిరుపతి, జూలై 20, 2013: యువతీ యువకులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి రక్తదానం చేయాలని తితిదే కార్యనిర్వహణాధికారి శ్రీ ఎం.జి.గోపాల్ పిలుపునిచ్చారు. తిరుపతిలోని తితిదే కేంద్రీయ వైద్యశాలలో శనివారం ప్రేరణ హెల్పింగ్ సొసైటి ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని ఈవో ప్రారంభించారు.
రోడ్డు ప్రమాదాలు, ఇతర ప్రమాదకర వ్యాధులు సంభవించినపుడు రక్తం దొరక్క చాలా మంది మృత్యువాత పడుతున్నారని తెలిపారు. ఇలాంటి పరిస్థితులను ఎదుర్కోవాలంటే బ్లడ్బ్యాంకుల్లో చాలినంత రక్తం అందుబాటులో ఉంచుకోవాలన్నారు. రక్తదానం చేయడాన్ని యువత అలవాటుగా మార్చుకోవాలని, ఇలా చేయడం వల్ల ఆరోగ్యం కూడా బాగుంటుందని వివరించారు. రక్తదానం చేసిన యువతీ యువకులు తమ అనుభవాలను, ప్రయోజనాలను తమ స్నేహితులకు వివరించి ప్రోత్సహించాలని కోరారు. ఈ శిబిరంలో సుమారు 50 మంది యువతీ యువకులు రక్తదానం చేశారు.
ఈ కార్యక్రమంలో తితిదే తిరుపతి జెఈవో శ్రీ పి.వెంకట్రామిరెడ్డి, సివిఎస్ఓ శ్రీ జివిజి.అశోక్కుమార్, ముఖ్య వైద్యాధికారి డాక్టర్ రామచంద్రమూర్తి రాజు, సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీ రాంప్రసాద్, వైద్యులు శ్రీమతి కుసుమకుమారి, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.