GOKULASTHAMI CELEBRATED WITH GRANDEUR IN TIRUPATI AND TIRUMALA _ దేశీయ ఆవుల పరిశోధనా కేంద్రంగా ఎస్వీ గోశాల : తితిదే కార్యనిర్వహణాధికారి శ్రీ ఎం.జి.గోపాల్
దేశీయ ఆవుల పరిశోధనా కేంద్రంగా ఎస్వీ గోశాల : తితిదే కార్యనిర్వహణాధికారి శ్రీ ఎం.జి.గోపాల్
తిరుపతి, ఆగస్టు 28, 2013: శ్రీ వేంకటేశ్వర గోసంరక్షణశాలను దేశీయ ఆవుల పరిశోధనా కేంద్రంగా అభివృద్ధి చేస్తామని తితిదే కార్యనిర్వహణాధికారి శ్రీ ఎం.జి.గోపాల్ వెల్లడించారు. తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర గోసంరక్షణశాలలో బుధవారం శ్రీకృష్ణజన్మాష్టమి వేడుకలు వైభవంగా జరిగాయి.
ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన ఈఓ శ్రీ ఎం.జి.గోపాల్ మాట్లాడుతూ శ్రీకృష్ణుడు అర్జునుడికి బోధించిన గీతాసారాన్ని అందరూ పఠించి, భావితరాలకు అందించాలని కోరారు. భగవద్గీతలోని సూక్ష్మాంశాలను గ్రహించి మన కర్తవ్యాన్ని నిర్వహిస్తే భగవంతుడు తప్పక మనందరినీ కాపాడతారని పేర్కొన్నారు. గోదానం వల్ల మనిషి జీవనం పరిపూర్ణమవుతుందని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. సకల దేవతాస్వరూపాలైన గోవులను రక్షించుకోవడం ద్వారా భారతీయ హైందవ సంస్కృతిని కాపాడుకుందామని ఈవో పిలుపునిచ్చారు.
ముందుగా ఈఓ శ్రీ వేణుగోపాలస్వామివారికి పూజాది కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం గోపూజ చేసి కర్పూర హారతులు సమర్పించారు. అనంతరం శ్రీమహామంత్ర పీఠం అధ్యకక్షుడు పి.సాయిరెడ్డి ఆధ్వర్యంలో హైదరాబాదు నుండి తిరుపతికి వచ్చిన శ్రీమహామంత్ర రథం వద్ద ఈఓ పూజలు చేశారు. ప్రతి ఏటా నిర్వహిస్తున్న విధంగానే 11వ సారి ఏడు కోట్ల గోవిందనామ జపాల పుస్తకాలను శ్రీ వేంకటేశ్వర మహామంత్ర స్థూపం వద్ద సమర్పించారు. 12వ సారి సమర్పించేందుకు గాను తితిదే అధికారులు గోవిందనామాన్ని పుస్తకాల్లో రాసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా అన్నమచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో నిర్వహించిన నాదస్వర కచేరి, అన్నమయ్య సంకీర్తనల ఆలాపన, దాససాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో నిర్వహించిన భజనలు, కోలాటాలు ఆకట్టుకున్నాయి. సాయంత్రం తితిదే హిందూ ధర్మప్రచార పరిషత్ ఆధ్వర్యంలో హరికథ కార్యక్రమాలు జరుగనున్నాయి.
గోశాల సంచాలకులు డాక్టర్ కె.హరనాథరెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో స్విమ్స్ సంచాలకులు డాక్టర్ వెంగమ్మ ఇతర అధికార ప్రముఖులు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
తిరుమల గోగర్భ వనంలో 28న గోకులాష్టమి, ఉట్లోత్సవం
తిరుమల, 27 ఆగష్టు 2013 : బుధవారంనాడు శ్రీ కృష్టజన్మాష్టమిని పురస్కరించుకొని తిరుమలలోని గోగర్భవనంలో కాళీయమర్ధనుడైన శ్రీకృష్ణునికి అభిషేక మహోత్సవం మరియు ఉట్లోత్సవ కార్యక్రమాలు తి.తి.దే ఉద్యానవనశాఖ అధ్వర్యంలో కన్నుల పండుగగా నిర్వహించనున్నారు.
ఇందులో భాగంగా ముందుగా ఉదయం 11.30 గంటలకు ప్రారంభమయ్యే అభిషేక మహోత్సవ కార్యక్రమం సుమారు 2 గంటల పాటు కొనసాగనుంది. అనంతరం తిరుమలలోని స్థానిక యువకులు, భక్తులు కలిసి ఎంతో ఉల్లాసంగా, ఉత్సాహంగా పాల్గొని ఉట్లోత్సవ కార్యక్రమం ఘనంగా జరుగనుంది.
తిరుమలలో గోకులాష్టమి ఆస్థానం ః- శ్రీకృష్ణ జన్మాష్టమిని పురస్కరించుకొని శ్రీవారి ఆలయంలో రాత్రి 8 గంటల నుండి 10 గంటల నడుమ బంగారు వాకిలి చెంత శ్రీకృష్ణాష్టమి ఆస్థానం నిర్వహించనున్నారు.
ఆగష్టు 29న ఉట్లోత్సవం ః- కాగా గోకులాష్టమి మరునాడు తిరుమలలోని వివిధ ప్రాంతాల్లో ఉట్లోత్సవం కార్యక్రమం ఘనంగా జరుగుతుంది. ఈ సందర్భంగా మధ్యాహ్నం 1 గంట నుండి సాయంత్రం 5 గంటల నడుమ బంగారు తిరుచ్చిపై మలయప్పస్వామివారు, మరో తిరుచ్చిపై శ్రీకృష్ణస్వామివారు పెద్దజీయంగార్ మఠం, మహంతు మఠం మరియు ఇతర ప్రాంతాల మీదుగా చతుర్మాడ వీధులలో ఊరేగుతూ ఉట్లోత్సవంలో పాల్గొంటారు. కాగా ఈ సందర్భంగా తి.తి.దే ఆరోజు శ్రీవారి ఆలయంలో నిర్వహించే ఊంజల్సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, వసంతోత్సవం మరియు సహస్రదీపాలంకార సేవలను రద్దు చేసింది.
తి.తి.దే ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.