KALPAVRUKSHA VAHANAM  _ కల్పవృక్ష వాహనంపై కపిలేశ్వరస్వామి అభయం

On the 7th day of Ongoing Brahmotsavam in TTDs Sri Kapileswara Swamy Temple, the processional deity of Lord Kapileswara Swamy along with Goddess Parvathi were taken out in procession on “Kalpavruskha Vahanam” in Sri Kapileswara Swamy Temple in Tirupati on Saturday morning.

కల్పవృక్ష వాహనంపై కపిలేశ్వరస్వామి అభయం

తిరుపతి, మార్చి 9, 2013: తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో ఏడో రోజైన శనివారం ఉదయం శ్రీ కపిలేశ్వరస్వామివారు కల్పవృక్ష వాహనంపై భక్తులకు అభయమిచ్చారు. వాహనసేవ ఆలయం నుండి మొదలై కపిలతీర్థం రోడ్‌, అన్నారావు సర్కిల్‌, వినాయకనగర్‌ ఎల్‌ టైప్‌ క్వార్టర్స్‌, హరేరామ హరేకృష్ణ ఆలయం, ఎన్‌జిఓ కాలనీ, అలిపిరి బైపాస్‌ రోడ్‌ మీదుగా తిరిగి ఆలయానికి చేరుకుంది. భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించారు. భక్తజన బృందాల చెక్క భజనలు ఆకట్టుకున్నాయి.

అనంతరం ఉదయం 9.00 గంటల నుండి 11.00 గంటల వరకు అర్చకులు స్నపన తిరుమంజనం ఘనంగా నిర్వహించారు. శ్రీ సోమస్కందమూర్తి, శ్రీ కామాక్షి అమ్మవారికి పాలు, పెరుగు, తేనె, పండ్లరసాలు, చందనంతో అభిషేకం చేశారు. సాయంత్రం 6.30 గంటల నుండి రాత్రి 8.30 గంటల వరకు తిరుచ్చి ఉత్సవం వైభవంగా జరుగనుంది.
ఈ కార్యక్రమంలో తితిదే స్థానిక ఆలయాల ఉప కార్యనిర్వహణాధికారి శ్రీమతి రెడ్డెమ్మ,  కపిలేశ్వరాలయ  సూపరింటెండెంట్‌ శ్రీ సురేష్‌రెడ్డి, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్‌ శ్రీ కె.శ్రీనివాసులు పాల్గొన్నారు.

మహాశివరాత్రి సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు

శ్రీ కపిలేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో ఎనిమిదో రోజైన ఆదివారం మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు జరుగనున్నాయి. ఉదయం 7.00 నుండి 9.00 గంటల వరకు రథోత్సవం(భోగితేరు), సాయంత్రం 6.00 నుండి 10.00 గంటల వరకు నంది వాహనసేవ జరుగనున్నాయి. మార్చి 11వ తేదీ రాత్రి 12.00 గంటలకు లింగోర్భవకాల అభిషేకం ప్రారంభమవుతుంది. 12.00 నుండి 1.00 గంట వరకు మొదటి అభిషేకం, ఉదయం 1.00 నుండి ఉదయం 2.00 గంటల వరకు రెండో అభిషేకం, ఉదయం 2.00 నుండి ఉదయం 3.00 గంటల వరకు మూడవ అభిషేకం, ఉదయం 3.00 నుండి ఉదయం 4.00 గంటల వరకు నాలుగో అభిషేకం జరుగనున్నాయి.

మహతిలో ప్రత్యేక కార్యక్రమాలు

శ్రీ కపిలేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల సందర్భంగా మార్చి 10వ తేదీ ఆదివారం మహాశివరాత్రిని పురస్కరించుకుని తితిదే హిందూ ధర్మప్రచార పరిషత్‌ ఆధ్వర్యంలో తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో ప్రత్యేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరుగనున్నాయి.
సాయంత్రం 6.00 గంటలకు కుర్తాళం పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ సిద్ధేశ్వరానంద భారతీస్వామి వారిచే ”శివరాత్రి మహత్మ్యము” ఆధ్యాత్మిక ప్రవచనం, రాత్రి 7.00 నుండి 8.30 గంటల వరకు లబ్దప్రతిష్టులైన సాహితీమూర్తులతో ”శివకవుల వైభవం” సాహితీరూపకం, రాత్రి 9.00 నుండి అర్ధరాత్రి 11.00 గంటల వరకు ఎస్వీ సంగీత కళాశాల అధ్యాపకులు శ్రీ శబరి గిరీష్‌ బృందంతో ”శివ సంకీర్తన లహరి” కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
            
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.