KOIL ALWAR TIRUMANJANAM_ తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ఘనంగా కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం


ISSUED BY PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ఘనంగా కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

తిరుపతి, 2017 ఆగస్టు 29: సిరుల తల్లి తిరుచానూరు శ్రీ పద్మావతీ అమ్మవారి వార్షిక పవిత్రోత్సవాలను పురస్కరించుకొని అమ్మవారి ఆలయంలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఉదయం సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొలిపి సహస్రనామార్చాన, శుధ్ధి నిర్వహించారు.

ఆనంతరం ఉదయం 6.00 నుండి 8.30 గంటల వరకు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం చేపట్టారు. ఇందులో ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర అన్ని వస్తువులను నీటితో శుద్ధి చేశారు. అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచీలీగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్రమిశ్రమాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేశారు. అనంతరం భక్తులను ఉదయం 9.00 గంటల నుండి సర్వదర్శనానికి అనుమతించారు.

కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం సందర్భంగా మంగళవారం ఆలయంలో కల్యాణోత్సవం, ఊంజల్‌సేవలను రద్దు చేశారు.

ఈ కార్యక్రమంలో ఆలయ ప్రత్యేక శ్రేణి ఉపకార్యనిర్వహణాధికారి శ్రీ మునిరత్నంరెడ్డి, ఎఈవో శ్రీరాధకృష్ణ, ఆలయ ఆర్చకులు, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

సెప్టెంబరు 4 నుండి 6వ తేదీ వరకు పవిత్రోత్సవాలు…

తిరుచానూరులోని శ్రీపద్మావతి అమ్మవారి ఆలయంలో సెప్టెంబరు 4 నుంచి 6వ తేదీ వరకు మూడు రోజుల పాటు పవిత్రోత్సవాలు వైభవంగా జరుగనున్నాయి. ఈ ఉత్సవాలకు సెప్టెంబరు 3వ తేదీ సాయంత్రం అంకురార్పణం జరుగనుంది.

వైదిక సంప్రదాయం ప్రకారం జాతాశౌచం, మృతాశౌచం వంటి వేళల్లో ఆలయ ప్రవేశం నిషిద్ధం. అయినా యాత్రికుల వల్లగానీ, సిబ్బంది వల్ల గానీ తెలిసితెలియక ఇటువంటి దోషాలు జరుగుతుంటాయి. ఇలాంటి వాటివల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రానీయకుండా నివారించేందుకు ప్రతి ఏడాదీ మూడు రోజుల పాటు పవిత్రోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ. ఈ పవిత్రోత్సవాలలో ఆలయ శుద్ధి, పుణ్యాహవచనం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు.

ఈ సందర్భంగా సెప్టెంబరు 4వ తేదీన పవిత్రప్రతిష్ఠ, సెప్టెంబరు 5న పవిత్ర సమర్పణ, సెప్టెంబరు 6న పూర్ణాహుతి కార్యక్రమాలు జరుగనున్నాయి. రూ.750/- చెల్లించి గృహస్తులు (ఒకరికి మూడు రోజులపాటు) ఈ పవిత్రోత్సవాల ఆర్జిత సేవలో పాల్గొనవచ్చు. గృహస్తులకు 2 లడ్డూలు, 2 వడలు బహుమానంగా అందజేస్తారు.

పవిత్రోత్సవాల సందర్భంగా సెప్టెంబరు 3వ తేదీన అంకురార్పణం పురస్కరించుకుని కళ్యాణోత్సవం, ఊంజల్‌సేవ, సెప్టెంబరు 4వ తేదీ సోమవారం పవిత్రోత్సవాల్లో మొదటిరోజు కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, అష్టదళపాదపద్మారాధన, సెప్టెంబరు 5న రెండో రోజు మంగళవారం కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, సెప్టెంబరు 6న పవిత్రోత్సవాల్లో చివరిరోజు బుధవారం కల్యాణోత్సవం, ఆష్టోత్తర శతకళశాభిషేకం మరియు ఊంజల్‌సేవలను టిటిడి రద్దు చేయనుంది.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.