Review Meet on arrangements for 601th Annamacharya Jayanthi festivals _ మేనెల 7వ తేది నుండి 11వ తేది వరకు శ్రీమాన్ తాళ్ళపాక అన్నమాచార్యులు, తరిగొండ వెంగమాంబల జయంతి ఉత్సవాలు
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
మేనెల 7వ తేది నుండి 11వ తేది వరకు శ్రీమాన్ తాళ్ళపాక అన్నమాచార్యులు, తరిగొండ వెంగమాంబల జయంతి ఉత్సవాలు
తిరుపతి, ఏప్రిల్-15, 2009: శ్రీవేంకటేశ్వరస్వామివారి భక్తాగ్రేశ్వరులైన శ్రీమాన్ తాళ్ళపాక అన్నమాచార్యులు, తరిగొండ వెంగమాంబల జయంతి ఉత్సవాలను మేనెల 7వ తేది నుండి 11వ తేది వరకు ఘనంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని తితిదే కార్యనిర్వహణాధికారి శ్రీకె.వి.రమణాచారి తెలిపారు.
ఈ సందర్భంగా బుధవారంనాడు తితిదే పరిపాలనా భవనంలో సంబంధిత అధికారులతో ఏర్పాటుచేసిన ప్రత్యేక సమావేశంలో జయంతి ఉత్సవాల ఏర్పాట్లును ఆయన సమీక్షించారు.
శ్రీమాన్ తాళ్ళపాక అన్నమయ్య వారి 601వ జయంతి ఉత్సవాలు సందర్భంగా తాళ్ళపాక గ్రామం, తిరుపతి పట్టణాలలో మేనెల 9వ తేది నుండి 11వ తేది వరకు మూడురోజులపాటు సంగీత, సాహిత్య కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని శ్రీకె.వి.రమణాచారి సంబంధిత అధికారులను కోరారు. మేనెల 9వ తేదిన వీదయం 9.00 గంటలకు తాళ్ళపాక గ్రామంలో పూజలు నిర్వహించి, అన్నమయ్య 108 అడుగుల విగ్రహం దగ్గర ఆరువందల మంది కళాకారులతో సప్తగిరి సంకీర్తనా గోష్టిగానం నిర్వహించడానికి ఆన్ని ఏర్పాట్లు చేయాలని అన్నమాచార్య ప్రాజెక్టు డెరెక్టరు శ్రీ డా. మేడసాని మోహన్ను కోరారు. ఆదే రోజు సాయంత్రం 5 గంటలకు స్నపన తిరుమంజనం, ఆతర్వాత శ్రీమతి లయ బృందంచే నృత్య కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నామని ఆయన తెలిపారు. అదే విధంగా మే 10వ తేదిన సాయంత్రం 5 గంటలకు ఊంజల సేవ, ప్రఖ్యాత సంగీత కళాకారుడు శ్రీ రామకృష్ణ గారిచే భక్తి సంగీతం, ఆతర్వాత హరికథా కార్యక్రమాలు, మే 11వ తేదిన సాయంత్రం 5 గంటలకు శ్రీనివాస కళ్యాణం, ఆతర్వాత కూచిపూడి కళాకారులచే సంగీత, నృత్య కార్యక్రమాలు తాళ్ళపాకలో అన్నమయ్య విగ్రహం దగ్గర ఏర్పాటు చేస్తామని శ్రీ కె.వి.రమణ అన్నారు.
అన్నమయ్య 601వ జయంతి సందర్భంగా మే 9వ తేదిన ఉదయం 7 గంటలకు తిరుపతి పట్టణంలో అన్నమయ్య విగ్రహం దగ్గర నుండి ఒక ఊరేగింపు బయలుదేరి, మధ్యలో అన్నమయ్య సాహిత్యానికి విశేషంగా కృషి సల్పిన శ్రీమాన్ రాళ్ళపల్లి కృష్ణమాచార్యులు, శ్రీమాన్ వేటూరి ప్రభాకరశాస్త్రి, శ్రీమాన్ సాదు సుబ్రమణ్యం శాస్త్రి గార్ల విగ్రహాలకు పుష్పాంజలి ఘటించి, మహతి ఆడిటోరియం చేరుకుంటారని శ్రీ కె.వి.రమణాచారి తెలిపారు. మహతి ఆడిటోరియంలో మే 9వ తేది నుండి 11వ తేది వరకు అన్నమయ్య సాహిత్య సభలు, సంగీత, నృత్య కార్యక్రమాలు ఏర్పాటు చేస్తామని తితిదే కార్యనిర్వహణ అధికారి తెలిపారు. అన్నమయ్య జయంతి సందర్భంగా ప్రత్యేకంగా తయారు చేసిన సి.డి.లు పుస్తకాలు కూడా ఆవిష్కరిస్తామని ఆయన అన్నారు.
అదేవిధంగా మాతృశ్రీ తరిగొండ వేంగమాంబ 280వ జయంతి ఉత్సవాలను కూడా ఘనంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేయాలని శ్వేత డైరెక్టరు శ్రీ భూమన్ను కోరారు. తరిగొండ గ్రామంలో మే 7వ తేదిన ఉదయం 7 గంటలకు స్నపన తిరుమంజనం, ఆతర్వాత ఉపన్యాస, హరికథా కార్యక్రమాలు, మే 8వ తేదిన తిరుమలలో ఉదయం 8 గంటలకు మలయప్పస్వామి ఊరేగింపు, ఆతర్వాత నారాయణగిరి తోటలో పద్మావతి పరిణయ మండపంలో గోష్టిగానం, ఆదే రోజు సాయంత్రం 5 గంటలకు తిరుపతి పట్టణంలో మాతృ శ్రీ తరిగొండ వేంగమాంబ విగ్రహానికి పుష్పాంజలి సమర్పణ, సాయంత్రం 6 గంటలకు మహతి ఆడిటోరియంలో శ్రీమతి కొత్తపల్లి పద్మబృందంచే నృత్య ప్రదర్శన కార్యక్రమాలు ఏర్పాటు చేశామని శ్రీ భూమన్ తెలిపారు. అంతేగాకుండా తిరుపతి, హైదరాబాదు, వరంగల్, విశాఖపట్టణం, విజయవాడ పట్టణాలలో కూడా స్థానికి సంస్థల సహకారముతో తరిగొండ వేంగమాంబ జయంతి ఉత్సవాలను నిర్వహిస్తున్నామని శ్రీ కె.వి.రమణాచారి ఈ సందర్భంగా తెలిపారు. అంతేగాకుండా, జయంతి ఉత్సవాల సందర్భంగా పుస్తకాలు, సిడిలు కూడా విడుదల చేస్తామని ఆయన తెలిపారు.
ఈ సమీక్ష సమావేశంలో ముఖ్యనిఘా మరియు భద్రతాధికారి శ్రీపి.వి.ఎస్.రామకృష్ణ, స్పెషల్ గ్రేడ్ డిప్యూటి ఇఒ(జనరల్) శ్రీ ఆర్. ప్రభాకర్రెడ్డి, స్పెషల్ గ్రేడ్ డిప్యూటి ఇఒ (సేవలు) శ్రీ టి.ఎ.పి. నారాయణ, అన్నామాచార్య ప్రాజెక్టు డైరెక్టరు శ్రీ మేడసాని మోహన్, డిప్యూటి ఇఒ (టెంపుల్) శ్రీ సిద్దయ్య, డిప్యూటి ఇఒ (పి.ఎ.టి.) శ్రీ ఢిల్లీబాబు, డిప్యూటి ఇఒ (లోకల్ టెంపుల్) సూపరింటెండెంట్ ఇంజనీరు శ్రీ సుధాకర్రావు, డి.పి.పి. సెక్రెటరి డా. విజయరాఘవాచార్యులు, ఎస్.వి. భక్తిఛానల్ కో-ఆర్డినేటర్ శ్రీ అనంతపద్మనాభరావు తదితరులు పాల్గోన్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.