జూలై 13 నుండి 15వ తేదీ వరకు శ్రీ సుందరరాజస్వామివారి వార్షిక అవతార మహోత్సవాలు

జూలై 13 నుండి 15వ తేదీ వరకు శ్రీ సుందరరాజస్వామివారి వార్షిక అవతార మహోత్సవాలు

తిరుపతి, 2017 జూలై 09: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయానికి అనుబంధంగా ఉన్న శ్రీ సుందరరాజ స్వామివారి అవతార మహోత్సవాలు జూలై 13 నుండి 15వ తేదీ వరకు మూడు రోజుల పాటు వైభవంగా జరుగనున్నాయి.

ఈ సందర్భంగా ఆలయంలో ప్రతిరోజూ ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఇందులో భాగంగా మూడు రోజుల పాటు మధ్యాహ్నం శ్రీ సుందరరాజస్వామివారికి అభిషేకం, సాయంత్రం శ్రీక ష్ణస్వామివారి ముఖమండపంలో ఊంజల్‌ సేవ నిర్వహిస్తారు. మొదటి రోజు రాత్రి పెద్దశేష వాహనంపై, రెండోరోజు హనుమంత వాహనంపై, మూడోరోజు గరుడ వాహనంపై శ్రీసుందరరాజస్వామివారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులను కటాక్షిస్తారు.

సంక్షిప్త సమాచారం :

శ్రీ సుందరరాజస్వామివారి అవతార మహోత్సవాల పురాణ నేపథ్యాన్ని పరిశీలిస్తే చాలా సంవత్సరాల క్రితం ముష్కరులు మధురైలో ఉన్న అళగిరి పెరుమాళ్‌ కోయిల్‌ను కూల్చేందుకు ప్రయత్నించారట. ఆ సమయంలో అక్కడున్న అర్చకస్వాములు శ్రీ సుందరరాజస్వామివారి ఉత్సవమూర్తులను తిరుచానూరుకు తీసుకొచ్చారని ప్రచారంలో ఉంది. దానికి తగ్గట్టుగానే స్వామివారి విగ్రహాలు(ఉత్సవర్లు) పురాతనంగా కనిపిస్తున్నాయి. మహంతుల కాలంలో అనగా 1902వ సంవత్సరంలో మూలమూర్తులను తయారుచేసి ప్రతిష్ఠించారని చరిత్ర ద్వారా తెలు స్తోంది. ఆ తరువాత సుందరరాజస్వామివారికి అనేక ఉత్సవాలు జరిగాయి. స్వామివారిని జ్యేష్టమాసంలో శతభిష నక్షత్రం నాడు తిరుచానూరుకు తీసుకొచ్చినందున ఆ రోజు నుండి ఉత్తరాభాద్ర నక్షత్రం నాటికి ముగిసేలా అవతార మహోత్సవాలను టిటిడి వైభవంగా నిర్వహిస్తోంది.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.