SWAMY PUSHKARINI RENOVATION WORKS BEGINS AT TIRUMALA _ స్వామి పుష్కరిణి మరమత్తులు ప్రారంభం – నెల రోజుల పాటు పుష్కరిణి హారతి రద్దు
స్వామి పుష్కరిణి మరమత్తులు ప్రారంభం – నెల రోజుల పాటు పుష్కరిణి హారతి రద్దు
తిరుమల, 2012 ఆగస్టు 1: ఈ ఏడాది తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామికి సెప్టెంబరు మరియు అక్టోబరు మాసాల్లో రెండు బ్రహ్మోత్సవాలు జరుగనున్న నేపథ్యంలో స్వామి పుష్కరిణి మరమత్తు పనులు బుధవారం నుండి తితిదే ప్రారంభించింది. ఈ పనులు ఆగస్టు నెలాఖరు వరకు జరుగనున్నాయి. ఈ సందర్భంగా తితిదే పుష్కరిణి హారతిని ఈ నెలాఖరు వరకు రద్దు చేసింది.
తిరుమల క్షేత్రంలో అత్యంత ప్రసిద్ధమైన దర్శనీయ క్షేత్రంగా భాసిల్లుతున్న స్వామి పుష్కరిణి మరమత్తు పనులను బ్రహ్మోత్సవాలకు ఒక నెల ముందుగా చేపట్టడం తితిదే ఆనవాయితీగా పాటిస్తున్నది. ఇందులో భాగంగా ఈ ఏడాది సెప్టెంబరు 18వ తేదీ నుండి 26వ తేదీ వరకు శ్రీవారి వార్షిక సాలకట్ల బ్రహ్మోత్సవాలు, అక్టోబరు 15 నుండి 23వ తేదీ వరకు శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి.
దాదాపు కోటి లీటర్ల నీటి సామర్థ్యమున్న ఈ పుష్కరిణి మరమ్మతు పనులకు సుమారు నెల రోజులు పట్టనుంది. పుష్కరిణిలో ఉన్న పాత నీటిని యావత్తు తొలగించి కొత్త హంగులను, రంగులను, మరమ్మతు కార్యక్రమాలను ఆగస్టు 31వ తేదీ వరకు తితిదే నీటిపారుదల శాఖ సిబ్బంది నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమాలను నీటిపారుదల శాఖ నిర్వాహక నిర్మాణాధికారి (ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్) శ్రీ నరసింహమూర్తి నేతృత్వంలో సిబ్బంది పనులను ప్రారంభించారు.
స్వామివారి పుష్కరిణి నూతన హంగులతో కళకళలాడుతూ సెప్టెంబరు 1వ తేదీ నుండి భక్తులకు పునర్దర్శనం ఇవ్వనుంది.