THREE DAY ANNUAL PAVITHROTSAVAM IN SRI KAPILESWARA SWAMY TEMPLE BEGINS _ వైభవంగా శ్రీ కపిలేశ్వరస్వామివారి పవిత్రోత్సవాలు ప్రారంభం
వైభవంగా శ్రీ కపిలేశ్వరస్వామివారి పవిత్రోత్సవాలు ప్రారంభం
తిరుపతి, జూలై 19, 2013: తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామివారి పవిత్రోత్సవాలు శుక్రవారం వైభవంగా ప్రారంభమ య్యాయి. ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి అభిషేకం నిర్వహించారు. ఉదయం 9.00 గంటలకు పంచమూర్తులైన శ్రీ కపిలేశ్వరస్వామి, శ్రీ కామాక్షమ్మ అమ్మవారు, శ్రీ విఘ్నేశ్వర స్వామి, శ్రీ సుబ్రమణ్యస్వామి, శ్రీ చండికేశ్వరస్వామివార్ల ఉత్సవర్లకు కల్యాణమండపంలో స్నపన తిరుమంజనం ప్రారంభమైంది. ఇందులో పాలు, తేనె, పెరుగు, కొబ్బరినీళ్లు, పంచామృతం, చెరకురసం, చందనం, పసుపు, విభూది, వివిధ రకాల పండ్లరసాలతో అభిషేకం చేశారు. అనంతరం కలశాభిషేకం చేసి ధూపదీప నైవేద్యం సమర్పించారు.
సాయంత్రం 6.00 గంటలకు పవిత్రోత్సవ కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. ఇందులో భాగంగా గణపతిపూజ, కలశపూజ, పరివారదేవతాపూజ, అగ్నిప్రతిష్ఠ, శాంతిహోమాలతో కలశస్థాపనం చేస్తారు. రూ.500/- చెల్లించి ఇద్దరు గృహస్తులు ఒక రోజు పవిత్రోత్సవాల్లో పాల్గొనవచ్చు. గృహస్తులకు ఒక లడ్డూ, ఉత్తరీయం, రవికె బహుమానంగా అందజేస్తారు.
ఈ కార్యక్రమంలో తితిదే స్థానిక ఆలయాల ఉప కార్యనిర్వహణాధికారి శ్రీమతి రెడ్డెమ్మ, సూపరింటెండెంట్ శ్రీ మునిసురేష్రెడ్డి, టెంపుల్ ఇన్స్పెక్టర్లు శ్రీ శ్రీనివాసులు, శ్రీ సురేష్, ప్రధాన అర్చకులు శ్రీ ఉదయా గురుకుల్, శ్రీ స్వామినాధ్ గురుకుల్, శ్రీ మణివాసగురుకుల్, శ్రీ చంథ్రేఖర్ గురుకుల్, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.