THREE DAY ANNUAL PAVITHROTSAVAM IN SRI PADMAVATHI AMMAVARI TEMPLE CONCLUDES _ శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ముగిసిన పవిత్రోత్సవాలు
శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ముగిసిన పవిత్రోత్సవాలు
తిరుపతి, సెప్టెంబరు 19, 2013: తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి ఆలయంలో మూడోరోజు గురువారం మహాపూర్ణాహుతి, పవిత్ర విసర్జనంతో పవిత్రోత్సవాలు ఘనంగా ముగిశాయి. ఉత్సవాల్లో భాగంగా చివరిరోజు ఆలయంలో విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు.
ఉదయం శాస్త్రోక్తంగా మహాపూర్ణాహుతి, శాంతి హోమం, పవిత్ర విసర్జనం, కుంభప్రోక్షణ, నివేదన నిర్వహించి తీర్థప్రసాద వినియోగం చేశారు. మధ్యాహ్నం అమ్మవారికి శాస్త్రోక్తంగా స్నపనతిరుమంజనం నిర్వహించారు. ఇందులో పసుపు, చందనం, పాలు, పెరుగు, తేనె, పన్నీరు, వివిధ రకాల ఫలాలతో అభిషేకం చేశారు. అనంతరం అమ్మవారి పద్మపుష్కరిణిలో చక్రస్నానం వైభవంగా జరిగింది.
సాయంత్రం 6.00 గంటలకు శ్రీ పద్మావతి అమ్మవారు, శ్రీకృష్ణస్వామివారు, శ్రీ సుందరరాజ స్వామివారి ఉత్సవమూర్తులను ఆలయ నాలుగు మాడ వీధుల్లో వైభవంగా ఊరేగింపు నిర్వహించనున్నారు. రాత్రి రక్షాబంధనము, ఆచార్య, రిత్విక సన్మానముతో పవిత్రోత్సవాలు ముగియనున్నాయి.
ఈ కార్యక్రమంలో తితిదే స్థానిక ఆలయాల ప్రత్యేకశ్రేణి డెప్యూటీ ఈఓ శ్రీ భాస్కర్రెడ్డి, ఏఈఓ శ్రీమతి నాగరత్న, ఆలయ అర్చకులు, ఇతర అధికార ప్రముఖులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.