TIRUMALA JEO FELICITATES STAFFS OF AUCTION DEPARTMENT _ తలనీలాల ఆదాయం పెంపునకు కృషి చేసిన సిబ్బందికి జెఈవో సన్మానం
తలనీలాల ఆదాయం పెంపునకు కృషి చేసిన సిబ్బందికి జెఈవో సన్మానం
తిరుమల, సెప్టెంబరు 18, 2013: తలనీలాల వేలంలో ఆదాయం పెంపునకు కృషి చేసిన తితిదే సిబ్బందిని తిరుమల సంయుక్త కార్యనిర్వహణాధికారి శ్రీ కె.ఎస్.శ్రీనివాసరాజు బుధవారం తిరుమలలోని అన్నమయ్య భవనంలో సన్మానించారు.
తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి దర్శనార్థం విచ్చేస్తున్న వేలాది మంది భక్తులు భక్తిప్రపత్తులతో కొన్ని థాబ్దాలుగా తమ తలనీలాలను సమర్పించుకుంటున్నారు. ఈ తలనీలాల పొడవుననుసరించి వివిధ విభాగాలుగా విభజించి వేలం ద్వారా తితిదే కొన్ని కోట్ల రూపాయలను ప్రతి ఏటా ఆర్జిస్తోంది. రెండేళ్లుగా తితిదే ఈ తలనీలాల వేలం విధానంలో మరింత పారదర్శకత పెంపొందించే రీతిలో ఈ-వేలాన్ని అనుసరించిన విషయం విదితమే. తిరుమల జెఈవో శ్రీ కె.ఎస్.శ్రీనివాసరాజు ప్రత్యక్ష పర్యవేక్షణలో చేపట్టిన తలనీలాల ఈ-వేలానికి దేశవ్యాప్తంగా అనూహ్యస్పందన వచ్చింది. తలనీలాల ఆదాయం కూడా గణనీయంగా పెరిగింది. ఏడాదికి రూ.60 కోట్ల నుండి రూ.70 కోట్ల ఆదాయం పండిస్తున్న ఈ ‘నల్లబంగారం’ ద్వారా 2011-12వ ఆర్థిక సంవత్సరంలో రూ.204 కోట్లు, ఈ సంవత్సరంలో ఆరు నెలల కాలానికి రూ.108 కోట్లు తితిదే ఆదాయం ఆర్జించింది. మార్కెటింగ్ జనరల్ మేనేజర్(ఆక్షన్) శ్రీ సుబ్రమణ్యం ఆధ్వర్యంలో డెప్యూటీ ఈఈ శ్రీ సత్యం పర్యవేక్షణలో తలనీలాల ఈ-వేలం విధానం జెఈవో ఆదేశాల మేరకు అద్భుతమైన ఫలితాలను అందించింది.
ఈ సందర్భంగా తలనీలాల వేలంలో రెండేళ్లలో అద్భుత ఫలితాలు సాధించిన తితిదే సిబ్బందిని బుధవారం నాడు తిరుమలలోని అన్నమయ్య భవనంలో జెఈవో ప్రశంసాపత్రం, నగదు బహుమతితో సన్మానించారు. ముఖ్యంగా తలనీలాలను 1వ, 2వ, 3వ, 4వ, 5వ శ్రేణులుగా విభజించి నాణ్యమైన ఫలితాలను అందించిన 39 మంది కార్మికులను తిరుమల జెఈవో ప్రశంసించారు. వీరిలో 23 మంది తిరుమల కల్యాణకట్టలో పనిచేసే కార్మికులు కాగా, 16 మంది తిరుపతిలోని తలనీలాల గోడౌన్లో విధులు నిర్వహిస్తున్నారు. తలనీలాల వేలంలో తితిదే ఆదాయం పెంచేందుకు విశేషకృషి చేసిన కార్మికులను ఈ సందర్భంగా జెఈవో అభినందించారు. ఈ కార్యక్రమంలో తలనీలాల గోడౌన్, ఆక్షన్ విభాగం అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.