ఘనంగా ముగిసిన శ్రీ వేదాంత దేశికర్‌ సాలకట్ల ఉత్సవం

ఘనంగా ముగిసిన శ్రీ వేదాంత దేశికర్‌ సాలకట్ల ఉత్సవం

తిరుపతి, 2017 అక్టోబరు 28: తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయానికి అనుబంధంగా ఉన్న శ్రీవేదాంత దేశికర్‌ ఆలయంలో అక్టోబర్‌ 18వ తేదీ నుండి నిర్వహిస్తున్న సాలకట్ల ఉత్సవం శనివారం ఘనంగా ముగిసింది. శ్రీవేంకటేశ్వరస్వామివారి ఘంటా స్వరూపులు శ్రీవేదాంతదేశికర్‌. ఈయన జన్మదినాన్ని పురస్కరించుకుని ఈ ఉత్సవం నిర్వహిస్తారు.

ఈ సందర్భంగా ఉదయం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీగోవిందరాజస్వామివారు శ్రీవేదాంత దేశికర్‌ ఆలయానికి వేంచేపు చేస్తారు. ఉదయం 10.00 నుండి 12.00 గంటల వరకు స్వామి, అమ్మవార్లు, శ్రీ వేదాంత దేశికర్‌ ఉత్సవర్లకు స్నపనతిరుమంజనం, తిరుప్పావై, శాత్తుమొర, ఆస్థానం నిర్వహించారు.

అనంతరం సాయంత్రం 6.00 గంటలకు తిరుమల శ్రీవారి ఆలయం నుంచి అప్పా పడిని ఊరేగింపుగా తెచ్చి శ్రీ వేదాంత దేశికర్‌ వారికి సమర్పిస్తారు. రాత్రి 8.00 నుండి 9.30 గంటల వరకు శ్రీ భూ సమేత గోవిందరాజస్వామివారు, శ్రీవేదాంత దేశికర్‌ ఆలయ నాలుగు మాడ వీధులలో ఊరేగి భక్తులను అనుగ్రహించనున్నారు.

శ్రీవేంకటేశ్వరస్వామివారి జన్మించిన భాద్రపద మాసం శ్రవణా నక్షత్రంలోనే శ్రీవేదాంత దేశికర్‌ జన్మించారు. సుమారు 750 సంవత్సరాల క్రితం కాంచీపురంలోని తూప్పుల్‌ అగ్రహారంలో పుట్టారు. ఈయన స్వామివారిని కీర్తిస్తూ దయా శతకం అనే స్తోత్రం రచించారు. శ్రీవారి సుప్రభాతం రచించిన శ్రీ ప్రతివాద భయంకర అణ్ణన్‌కు శ్రీ వేదాంత దేశికర్‌ గురువర్యులు.

ఈ కార్యక్రమంలో టిటిడి స్థానిక ఆలయాల డెప్యూటీ ఈవో శ్రీమతి వరలక్ష్మీ, ఏఈవో శ్రీప్రసాదమూర్తి రాజు, ఇతర అధికారులు, అర్చకులు, విశేస సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.