అక్టోబరు 1న శ్రీ ప్రసన్నవేంకటేశ్వరస్వామివారి పవిత్రోత్సవాలు

అక్టోబరు 1న శ్రీ ప్రసన్నవేంకటేశ్వరస్వామివారి పవిత్రోత్సవాలు

తిరుపతి, సెప్టెంబరు 25, 2013: తిరుపతికి సమీపంలో తితిదేకి అనుబంధంగా ఉన్న శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో అక్టోబరు ఒకటో తేదీన పవిత్రోత్సవాలు వైభవంగా జరుగనున్నాయి. సెప్టెంబరు 30న అంకురార్పణం శాస్త్రోక్తంగా జరుగనుంది.
వైదిక సంప్రదాయం ప్రకారం జాతాశౌచం, మృతాశౌచం వంటి వేళల్లో ఆలయ ప్రవేశం నిషిద్ధం. అయినా యాత్రీకుల వల్లగానీ, సిబ్బంది వల్ల గానీ తెలిసీతెలియక ఇటువంటి దోషాలు జరుగుతుంటాయి. వాటివల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రానీయకుండా నివారించేందుకు పవిత్రోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ. ఈ పవిత్రోత్సవాలలో ఆలయ శుద్ధి, పుణ్యాహవచనం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు.

సెప్టెంబరు 30వ తేదీన అంకురార్పణం సందర్భంగా సాయంత్రం సేనాధిపతి ఉత్సవం, యాగశాల వైదిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. అక్టోబరు ఒకటో తేదీన ఉదయం 10.30 నుండి 11.30 గంటల వరకు పవిత్ర సమర్పణ, అనంతరం విశేష నివేదన చేస్తారు. సాయంత్రం 5.00 నుండి 6.00 గంటల వరకు స్వామివారు, అమ్మవారితో కలిసి ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరిస్తారు. రాత్రి 7.00 నుండి 8.00 గంటల వరకు పూర్ణాహుతితో పవిత్రోత్సవాలు ముగియనున్నాయి. ఆ తరువాత కుంభబింబం ప్రదక్షిణం, సంప్రోక్షణ, విశేష నివేదన నిర్వహిస్తారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.