వైకుంఠ ఏకాదశికి టిటిడి స్థానిక ఆలయాలు ముస్తాబు
వైకుంఠ ఏకాదశికి టిటిడి స్థానిక ఆలయాలు ముస్తాబు
తిరుపతి, 2020 జనవరి 05: జనవరి 6వ తేదీన వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని టిటిడి స్థానిక ఆలయాలలో భక్తుల సౌకర్యార్థం విస్తృతంగా ఏర్పాట్లు చేశారు. అన్ని ఆలయాల్లో ప్రత్యేక క్యూలైన్లు, చలువ పందిళ్లు, రంగవల్లులు తీర్చిదిద్ది వివిధ రకాల పుష్పాలతో అందంగా అలంకరించారు.
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో…
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో సోమవారం వైకుంఠ ఏకాదశి సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా ఉదయం 10.00 నుండి 11.00 గంటల వరకు శ్రీ కృష్ణస్వామివారి ముఖ మండపంలో అమ్మవారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం వైభవంగా నిర్వహించనున్నారు. అనంతరం ఉదయం 11.00 నుండి 12.00 గంటల వరకు తిరుచ్చిపై ఆలయ నాలుగు మాడ వీధులలో ఊరేగి భక్తులను కటాక్షించనున్నారు.
జనవరి 7వ తేదీ ద్వాదశి నాడు ఉదయం 7.00 నుండి 9.00 గంటల వరకు శ్రీసుదర్శన చక్రత్తాళ్వార్కు తిరుమంజనం, చక్రస్నానం జరుగనుంది.
శ్రీనివాసమంగాపురంలో …
జనవరి 6న వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని వేకువజామున 12.05 గంటల నుండి 3.00 గంట వరకు ధనుర్మాస కైంకర్యాలు, తోమాల సేవ, కొలువు, పంచాంగ శ్రవణం నిర్వహిస్తారు. వేకువజామున 3.00 నుండి సాయంత్రం 4.00 గంటల వరకు భక్తులను సర్వదర్శనానికి అనుమతిస్తారు. సాయంత్రం 4.00 నుండి 5.00 గంటల వరకు రాత్రి కైంకర్యాలు తిరిగి 5.00 నుండి రాత్రి 9.00 గంటల వరకు భక్తులను స్వామివారి దర్శనానికి అనుమతిస్తారు. ఈ సందర్భంగా జనవరి 11న ఆర్జిత కల్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం సేవలు రద్దు కానున్నాయి.
అదేవిధంగా జనవరి 7న వైకుంఠ ద్వాదశి సందర్భంగా ఉదయం 4.00 నుండి 5.30 గంటల వరకు ధనుర్మాస కైంకర్యాలు, తోమాల సేవ, కొలువు, పంచాంగ శ్రవణం తోమాల సేవ, కొలువు, పంచాంగ శ్రవణం నిర్వహిస్తారు. ఉదయం 9.00 నుండి 10.00 గంటల వరకు చక్రస్నానం నిర్వహిస్తారు.
అప్పలాయగుంటలో ….
అప్పలాయగుంటలోని శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో జనవరి 6న వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని సోమవారం వేకువ జామున 3.30 నుండి 4.00 గంటల వరకు తిరుప్పావైతో స్వామివారిని మేల్కొలిపి, ధనుర్మాస కైంకర్యాలు నిర్వహిస్తారు. ఉదయం 5.00 నుండి రాత్రి 8.00 గంటల వరకు భక్తులను సర్వదర్శనానికి అనుమతిస్తారు. సాయంత్రం 5.00 నుండి 6.00 గంటల వరకు తిరువీధి ఉత్సవం జరగనుంది. అనంతరం రాత్రి కైంకర్యాలు నిర్వహిస్తారు. జనవరి 7న వైకుంఠ ద్వాదశి సందర్భంగా ఉదయం 8.00 గంటలకు స్వామి, అమ్మవార్ల ఊరేగింపు, 9.00 గంటలకు స్నపన తిరుమంజనం, ఉదయం 10.00 గంటలకు చక్రస్నానం నిర్వహించనున్నారు.
నారాయణవనంలో …
నారాయణవనంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా సోమవారం వేకువజామున 5.00 నుండి 6.00 గంటల వరకు తిరుప్పావైతో స్వామివారిని మేల్కొలిపి, ధనుర్మాస కైంకర్యాలు, తోమాల సేవ, కొలువు, పంచాంగ శ్రవణం నిర్వహిస్తారు. ఉదయం 7.00 నుండి రాత్రి 7.30 గంటల వరకు భక్తులను సర్వదర్శనానికి అనుమతిస్తారు. సాయంత్రం 5.30 నుండి రాత్రి 7.00 గంటల వరకు శ్రీవారి గ్రామోత్సవం, ఆస్థానం నిర్వహించనున్నారు.
నాగలాపురంలో …
నాగలాపురంలోని శ్రీ వేద నారాయణస్వామివారి ఆలయంలో జనవరి 6న వైకుంఠ ఏకాదశి పురస్కరించుకుని వేకువజామున 3.00 నుండి 4.30 గంటల వరకు తిరుపాల్లచ్చితో స్వామివారిని మేల్కొలిపి, తోమాల సేవ, కొలువు, పంచాంగ శ్రవణం, ధనుర్మాస కైంకర్యాలు నిర్వహిస్తారు. ఉదయం 5.00 నుండి రాత్రి 8.00 గంటల వరకు భక్తులకు సర్వదర్శనం కల్పిస్తారు. ఉదయం 10.00 గంటలకు ఉత్సవర్లకు అభిషేకం, సాయంత్రం 6.00 నుండి రాత్రి 8.00 గంటల వరకు తిరువీధి ఉత్సవం నిర్వహిస్తారు.
అదేవిధంగా తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయం, శ్రీ కోదండరామాలయం, చంద్రగిరిలోని శ్రీ కోదండరామాలయం, కార్వేటినగరంలోని శ్రీ వేణుగోపాలస్వామివారి ఆలయం, పిఠాపురంలోని శ్రీపద్మావతి సమేత వేంకటేశ్వరస్వామివారి ఆలయం, కీలపట్ల శ్రీ కోనేటిరాయస్వామివారి ఆలయం, బెంగుళూరులోని శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయాల్లో వైకుంఠ ఏకాదశికి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.