శ్రీ కోదండరామాలయంలో ఘనంగా శ్రీరామ మహామంత్రానుష్ఠాన మహాయాగం

శ్రీ కోదండరామాలయంలో ఘనంగా శ్రీరామ మహామంత్రానుష్ఠాన మహాయాగం

 తిరుపతి, ఏప్రిల్‌ 18, 2013: తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో గురువారం శ్రీరామ మహామంత్రా నుష్ఠానపూర్వక మహాయాగం శాస్త్రోక్తంగా జరిగింది. తితిదే వైఖానస ఆగమ సలహాదారు శ్రీ వేదాంతం విష్ణుభట్టాచార్యులు ఆధ్వర్యంలో వంద మందికిపైగా ఋత్వికులు యాగం నిర్వహించారు. వైకానస ఆగమశాస్త్ర ప్రకారం అర్చకులు రామగాయత్రి, సీతాగాయత్రి మంత్రాలు జపిస్తుండగా యాగం సాగింది. ఉదయం 8.00 గంటలకు మొదలైన మహాయాగం మధ్యాహ్నం 1.00 గంటకు పూర్ణాహుతితో ముగిసింది. రామతత్వాన్ని ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తి చేసేందుకు, లోకకల్యాణం కోసం, ప్రపంచశాంతి కోసం ఈ మహాయాగం నిర్వహించినట్టు తితిదే ఆగమ సలహాదారు శ్రీ వేదాంతం విష్ణుభట్టాచార్యులు తెలిపారు.

ఈ కార్యక్రమంలో స్థానిక ఆలయాల ఉప కార్యనిర్వహణాధికారి శ్రీ చంథ్రేఖరపిళ్లై,  తితిదే హిందూ ధర్మప్రచార పరిషత్‌ ప్రత్యేకాధికారి శ్రీ రఘునాధ్‌, గోవిందరాజస్వామి ఆలయ సహాయ కార్యనిర్వహణాధికారి శ్రీ ప్రసాదమూర్తిరాజు, ఆలయ సూపరింటెండెంట్‌ శ్రీ సురేష్‌రెడ్డి, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్‌ శ్రీ శేషారెడ్డి, పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.