TIRUPATI JEO INSPECTS KANYAKUMARI SITE _ కన్యాకుమారిలో శ్రీవారి ఆలయ నిర్మాణ స్థలం పరిశీలన
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
కన్యాకుమారిలో శ్రీవారి ఆలయ నిర్మాణ స్థలం పరిశీలన
తిరుపతి, ఏప్రిల్ 19, 2013: తమిళనాడు రాష్ట్రంలోని ప్రముఖ ధార్మికక్షేత్రమైన కన్యాకుమారిలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి దాతలు కేటాయించిన ఐదు ఎకరాల స్థలాన్ని శుక్రవారం తితిదే తిరుపతి సంయుక్త కార్యనిర్వహణాధికారి శ్రీ పి.వెంకట్రామిరెడ్డి పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన తితిదే ఇంజినీరింగ్ అధికారులతో మాట్లాడుతూ త్వరితగతిన ఆలయ నిర్మాణ పనులు చేపట్టాలని ఆదేశించారు. స్థానిక ప్రభుత్వ అధికారులతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరిపి వీలైనంత తొందరగా ఆలయ నిర్మాణం పూర్తి చేయాలన్నారు. అనంతరం ఆయన నాగర్కోయిల్ జిల్లా కలెక్టర్ శ్రీ నాగరాజన్తో చర్చించి శ్రీవారి ఆలయ నిర్మాణం త్వరితగతిన చేపట్టేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు.
కాగా కన్యాకుమారిలోని ఐదు ఎకరాల స్థలంలో శ్రీవారి ఆలయంతోపాటు ధ్యానమందిరం, గోశాల, పుష్కరిణి, వాహన మండపం, వేదపాఠశాల, అన్నప్రసాద కేంద్రం, కల్యాణమండపం, పోటు లాంటి ఇతర వసతులు కూడా తితిదే కల్పించనుంది. ఈ ఆలయాన్ని భక్తుల సందర్శనీయ క్షేత్రంగా అభివృద్ధి చేసేందుకు తితిదే చర్యలు చేపడుతోంది.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.