శ్రీ వేణుగోపాలస్వామివారి ఆలయంలో శాస్త్రోక్తంగా మహా శాంతి తిరుమంజనం
శ్రీ వేణుగోపాలస్వామివారి ఆలయంలో శాస్త్రోక్తంగా మహా శాంతి తిరుమంజనం
తిరుపతి, 2021 ఆగస్టు 26: కార్వేటినగరం శ్రీ వేణుగోపాలస్వామివారి ఆలయంలో అష్టబంధన జీర్ణోద్ధరణ మహాసంప్రోక్షణలో భాగంగా గురువారం మధ్యాహ్నం శాస్త్రోక్తంగా మహా శాంతి తిరుమంజనం నిర్వహించారు. కోవిడ్ – 19 వ్యాప్తి నేపథ్యంలో ఈ కార్యక్రమాలను ఏకాంతంగా నిర్వహిస్తారు.
ఇందులో భాగంగా గురువారం ఉదయం 8.30 నుండి 10.30 గంటల వరకు యాగశాలలో వైదిక కార్యక్రమాలు, ఉదయం 10.30 నుండి 11.30 గంటల వరకు జలాధివాసం జరిగాయి.
అనంతరం మధ్యాహ్నం 3.30 నుండి 5.30 గంటల వరకు శ్రీ రుక్మిణీ, సత్యభామ సమేత శ్రీ కృష్ణస్వామివారు, శ్రీ సీతా లక్ష్మణ, ఆంజనేయస్వామి సమేత శ్రీ రామచంద్రమూర్తి, అనంత, గరుడ, విష్వకేనులు, చక్రతాళ్వార్, పంచమూర్తుల ఉత్సవర్లకు మహా శాంతి తిరుమంజనం నిర్వహించారు. సాయంత్రం 6.30 గంటలకు శయనాధివాసం, విశేష హోమాలు జరుగనున్నాయి.
ఆగస్టు 27న ఉదయం 7 గంటలకు మహా పూర్ణాహూతి, విమాన సంప్రోక్షణ, గోపుర సంప్రోక్షణ నిర్వహించనున్నారు. అనంతరం ఉదయం 10.30 నుండి భక్తులను స్వామివారి దర్శనానికి అనుమతిస్తారు. సాయంత్రం 4.30 నుండి 6 గంటల వరకు స్వామి, అమ్మవార్లకు కల్యాణోత్సవం, రాత్రి 7.30 నుండి 8.30 గంటల వరకు ఆలయంలో ఊరేగింపు నిర్వహిస్తారు.
ఈ కార్యక్రమంలో ఆలయ ప్రత్యేక శ్రేణి డెప్యూటీ ఈవో శ్రీమతి పార్వతి, ఆగమ సలహాదారు శ్రీ వేదాంతం విష్ణుభట్టాచార్య, ఏఈవో శ్రీ దుర్గరాజు, సూపరింటెండెంట్ శ్రీ రమేష్, టెంపుల్ ఇన్స్పెక్టర్ శ్రీ కుమార్ పాల్గొన్నారు.
తి.తి.దే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.