ఘనంగా శ్రీ పద్మావతి అమ్మవారి వసంతోత్సవాలకు అంకురార్పణ

ఘనంగా శ్రీ పద్మావతి అమ్మవారి వసంతోత్సవాలకు అంకురార్పణ

తిరుపతి, మే  23, 2013:  తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక వసంతోత్సవాలకు గురువారం సాయంత్రం  ఘనంగా అంకురార్పణ నిర్వహించారు. ఇందులో భాగంగా ఉదయం సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొలిపి సహస్రనామార్చన, తిరుప్పావడ సేవ చేపట్టారు. సాయంత్రం 6.00 గంటల నుండి పుణ్యహవచనం, రక్షాబంధనం, అంకురార్పణ నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఆలయ నాలుగు మాడ వీధుల్లో సేనాధిపతి ఉత్సవం జరుగనుంది. 
కాగా మే 24 నుండి 26వ తేదీ వరకు మూడు రోజుల పాటు వసంతోత్సవాలు వేడుకగా జరుగనున్నాయి. మే 25వ తేదీ ఉదయం 7.00 గంటలకు స్వర్ణ రథోత్సవం కన్నుల పండువగా జరుగనుంది. ఈ మూడు రోజులపాటు ఆలయ నాలుగు మాడ వీధుల్లో అమ్మవారిని ఘనంగా ఊరేగించనున్నారు.
గృహస్త భక్తులు రూ.300/- చెల్లించి వసంతోత్సవంలో పాల్గొనవచ్చు. ఈ సేవలో పాల్గొన్న గృహస్తులకు ఒక ఉత్తరీయం, ఒర రవికె, రెండు లడ్డూలు బహుమానంగా అందజేయనున్నారు. వసంతోత్సవం సందర్భంగా ఆలయంలో మూడు రోజుల పాటు ఆర్జిత సేవలైన లక్ష్మీపూజ,కల్యాణోత్సవం, ఊంజలసేవను రద్దు చేశారు. ఆలయం వద్దనున్న ఆస్థాన మండపంలో ప్రతిరోజూ సాయంత్రం అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో భక్తి సంగీత కార్యక్రమాలు నిర్వహించనున్నారు. హిందూ ధర్మప్రచార పరిషత్‌ ఆధ్వర్యంలో కళాకారులతో భజనలు, కోలాటాలు ఏర్పాటు చేయనున్నారు.
   —————————–——————————————-
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.