జూలై 12 నుండి 14వ తేదీ వరకు శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయ సాలకట్ల సాక్షాత్కార వైభవం

జూలై 12 నుండి 14వ తేదీ వరకు శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయ సాలకట్ల సాక్షాత్కార వైభవం

తిరుపతి, జూలై 03, 2013: శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయ సాలకట్ల సాక్షాత్కార వైభవం జూలై 12 నుండి 14వ తేదీ వరకు వైభవంగా జరుగనుంది. అంతకుముందుగా జూలై 9వ తేదీన ఆలయంలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించనున్నారు.

కార్యక్రమంలో భాగంగా జూలై 12వ తేదీ ఉదయం 10.00 గంటల నుండి 11.30 గంటల వరకు స్వామి, అమ్మవార్ల ఉత్సవర్లకు స్నపనతిరుమంజనం నిర్వహిస్తారు. సాయంత్రం 6.00 గంటల నుండి 7.00 గంటల వరకు ఊంజల్‌ సేవ, రాత్రి 7.00 నుండి 8.00 గంటల వరకు ఆలయ నాలుగు మాడ వీధుల్లో తిరుచ్చి ఉత్సవం జరుపుతారు.

జూలై 13వ తేదీన ఉదయం 10.00 నుండి 11.30 గంటల వరకు ఉత్సవర్లకు స్నపనతిరుమంజనం, సాయంత్రం 6.00 నుండి 7.00 గంటల వరకు ఊంజల్‌ సేవ, రాత్రి 8.00 నుండి 9.00 గంటల వరకు హనుమంత వాహనసేవ నిర్వహిస్తారు.

అలాగే మూడో రోజైన జూలై 14వ తేదీన ఉదయం 10.00 నుండి 11.30 గంటల వరకు స్వామి, అమ్మవార్ల ఉత్సవర్లకు స్నపనతిరుమంజనం నిర్వహించనున్నారు. సాయంత్రం 6.00 నుండి 7.00 గంటల వరకు ఊంజల్‌ సేవ, రాత్రి 8.00 నుండి 9.30 గంటల వరకు గరుడ సేవ నిర్వహిస్తారు.

ఈ సందర్భంగా జూలై 9వ తేదీన స్వర్ణ పుష్పార్చన సేవ, జూలై 12 నుండి 14వ తేదీ వరకు ఆర్జిత కళ్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం సేవలు రద్దు కానున్నాయి. అదేవిధంగా తితిదే హిందూ ధర్మప్రచార పరిషత్తు, అన్నమాచార్య ప్రాజెక్టు, ఎస్వీ సంగీత, నృత్య కళాశాల ఆధ్వర్యంలో ప్రతిరోజూ ఆధ్యాత్మిక భక్తి సంగీత కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
ఆలయ సాక్ష్కాత్కార వైభవం నేపథ్యాన్ని పరిశీలిస్తే… ఇప్పటివరకు లభ్యమైన శాసనాధారాల ప్రకారం 14వ శతాబ్దం నుండి శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయానికి సంబంధించిన ముఖ్యమైన ఘట్టాలు ప్రారంభమైనట్టు తెలుస్తోంది.

క్రీ.శ 1433వ సంవత్సరంలో చంద్రగిరిని పాలించిన విజయనగర రాజుల వంశానికి చెందిన రెండవ దేవరాయ తిరుమలలో క్రమపద్ధతిలో వేదపారాయణం చేసేలా ప్రణాళిక రూపొందించారు. ఇది బహుళ ప్రజాదరణ పొందింది. ఈ విషయాన్ని ఆలయాధికారి తెలుసుకుని సిద్ధకోట్టై అని పిలవబడే శ్రీనివాసపురానికి(ఇప్పుడు శ్రీనివాసమంగాపురం) చెందిన 24 మంది మహాజనులను స్వామివారి ఆస్థానంలో వేదాలను పారాయణం చేసేందుకు నియమించారు. దీనికి ఆమోదం తెలిపిన రాజుగారు ఇందుకయ్యే ఖర్చు కోసం తన రాజ్య పరిధిలోని సిద్ధకోట్టై గ్రామం నుండి రాజ్య భాండాగారానికి వచ్చే సొమ్ములో అర్ధ భాగాన్ని మంజూరు చేశారు.

అనంతరం శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల మనవడైన శ్రీ తాళ్లపాక చినతిరుమలాచా ర్యులు శ్రీ కళ్యాణ వేంకటేశ్వరుడి ఆలయానికి జీర్ణోద్ధరణ చేసి స్వామివారికి పూజలను తిరిగి ప్రారంభించారు. ఈ క్రమంలో క్రీ.శ 1540లో చంద్రగిరిని పాలించే అచ్యుతరాయలు మంగాపురం గ్రామాన్ని సర్వమాన్య అగ్రహారం(పన్నులేని భూమి)గా శ్రీ తాళ్లపాక చినతిరుమలాచార్యులకు అందజేశారు.

అనంతరం క్రీ.శ 1780లో ముస్లిం రాజులు ఈ ఆలయాన్ని లూటీ చేశారు. ఆలయ ప్రధాన రాజగోపురం, గర్భాలయ గోపురం, విగ్రహాలను పూర్తిగా ధ్వంసం చేశారు. పాక్షికంగా ధ్వంసమైన కొన్ని విగ్రహాలు ప్రస్తుతం చంద్రగిరికోటలో భారత ప్రభుత్వ పురావస్తు శాఖ సంరక్షణలో ఉన్నాయి.

1920వ సంవత్సరంలో బ్రిటీషు ప్రభుత్వం ఈ ఆలయాన్ని జాతీయ పురాతన కట్టడంగా గుర్తించి భారత ప్రభుత్వ పురావస్తు శాఖ పరిధిలోకి తెచ్చింది. అప్పటి నుండి ఈ ఆలయం భారత ప్రభుత్వ పురావస్తు శాఖ రక్షిత కట్టడాల జాబితాలో ఉంది.

అనంతరం 1940వ సంవత్సరంలో తమిళనాడు రాష్ట్రం కాంచీపురానికి చెందిన మధ్వ బ్రాహ్మణుడు సుందరరాజ మంగాపురానికి వచ్చి శ్రీనివాసుడు తనకు కలలో కనిపించాడని తెలిపారు. ”శ్రీనివాసమంగాపురంలో ఉన్న నాకు ధూపదీప నైవేద్యాలు కరువయ్యాయి. నా ఆలయానికి పూర్వ వైభవం కల్పించు” అని స్వామి ఆదేశించారని వివరించారు.
తరువాత గ్రామపెద్దలైన వెంకటకృష్ణయ్య, నరసింగాపురం రెడ్డివారి నాధమునిరెడ్డి, గుర్రప్ప ఆచారి మరియు తొండవాడ మొగిలి సుందరరామిరెడ్డి తదితరులను సుందరరాజ కలిసి స్వామివారు తనకు కలలో కనిపించిన విషయాన్ని వివరించి సాయం చేయాలని కోరారు. ఆ సమయంలో ఆలయం మొత్తం ముళ్లపొదలు, చీమలపుట్టలు, విషపు కీటకాలు, పాములతో నిండి గోపురాలు కూలిపోయే స్థితిలో ఉండేది. గ్రామపెద్దల సాయంతో సుందరరాజ ముళ్లపొదలు, చీమలపుట్టలను తొలగించి ఆలయాన్ని పరిశుభ్రం చేశారు. స్వామివారు కలలో సూచించిన విధంగా 1940 జూలై 11న ఆషాడ శుద్ధ షష్ఠి రోజున తొలిపూజ చేశారు.

అదేవిధంగా అర్చకుడైన సుందరరాజకు స్వామివారు కలలో కనిపించి చెప్పిన విధంగా తితిదే అప్పటినుండి నిత్యపూజా కైంకర్యాలు నిర్వహిస్తోంది. అలాగే మొదటి పూజను నిర్వహించిన ఆషాడ శుద్ధ షష్ఠి రోజున ”సాక్షాత్కార వైభవం” పేరిట తితిదే ప్రతి ఏడాదీ ఉత్సవం నిర్వహిస్తోంది. ఈ ఉత్సవాన్ని బ్రహ్మోత్సవాల కంటే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి తితిదే నిర్వహిస్తుండడం విశేషం.

తి.తి.దే ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయడమైనది.