తెప్పపై  శ్రీ భూ సమేత కల్యాణ వెంకటేశ్వర స్వామి 

తెప్పపై  శ్రీ భూ సమేత కల్యాణ వెంకటేశ్వర స్వామి
       

 

తిరుపతి, ఫిబ్రవరి 21, 2013  : తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి తెప్పోత్సవాలలో భాగంగా మూడవ రోజు గురువారం  శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ కల్యాణవెంకటేశ్వర స్వామి తెప్పపై విహరిస్తు భక్తులకు కనువిందు చేయనున్నారు.

 

ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు.  ఉదయం 10.30 గంటల నుండి 11.30 గంటల వరకు స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఇందులో  శ్రీదేవి,భూదేవి సమేత శ్రీ కల్యాణవెంకటేశ్వర స్వామి ఉత్సవమూర్తులకు పాలు, పెరుగు, తేనె, చందనం, పలు రకాల పండ్ల రసాలతో అభిషేకం చేశారు. సాయంత్రం 6.00 గంటలకు గోవిందరాజస్వామివారి ఆలయం వద్ద గల నీరాడ మండపానికి ఉత్సవమూర్తులు వేంచేసారు.

 

సాయంత్రం 6.30 గంటలకు విద్యుద్దీపాలతో అందంగా అలంకరించిన తెప్పపై శ్రీ భూ సమేత శ్రీ కల్యాణవెంకటేశ్వర స్వామివారి తెప్పోత్సవం వైభవంగా ప్రారంభం కానుంది. మూడవరోజు స్వామివారు ఐదుచుట్లు తెప్పలపై విహరించి భక్తులకు కనువిందు చేయనున్నారు. అనంతరం రాత్రి 8.00 గంటల నుండి 9.00 గంటల వరకు ఆలయ నాలుగు మాఢవీధులలో ఊరేగుతూ భక్తులను అనుగ్రహించనున్నారు.
             
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.