నాగలాపురంలోని శ్రీ కోదండరామస్వామి వారి ఆలయంలో ఏప్రిల్‌ 17 నుండి శ్రీరామనవమి ఉత్సవాలు

నాగలాపురంలోని శ్రీ కోదండరామస్వామి వారి ఆలయంలో ఏప్రిల్‌ 17 నుండి శ్రీరామనవమి ఉత్సవాలు

తిరుపతి, ఏప్రిల్‌-13, 2013: ఏప్రిల్‌ 19వ తేదీన శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకొని తితిదే అనుబంధ ఆలయమైన నాగలాపురంలోని శ్రీ వేదనారాయణస్వామి ఆలయానికి అనుబంధంగా ఉన్న శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో ఏప్రిల్‌ 17 వ తేదీ నుండి మూడు రోజులపాటు ఉత్సవాలను ఘనంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ప్రతిరోజూ ఉదయం 9.00 గంటల నుండి 10.00 గంటల వరకు శ్రీ కోదండరామస్వామి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం నిర్వహించి, సాయంత్రం 5.30 గంటల నుండి 6.30 గంటల వరకు ఊంజలసేవ నిర్వహిస్తారు.ఏప్రిల్‌ 17  వ తేదీన సాయంత్రం 6.30 గంటల నుండి రాత్రి 8.30 గంటల వరకు తిరుచ్చిపై స్వామివార్ల తిరువీధి ఉత్సవం జరుగనుంది. రెండవ రోజు ఏప్రిల్‌ 18వ తేదీ సాయంత్రం 6.30 గంటల నుండి 8.30 గంటల వరకు శ్రీరాములవారు కల్పవృక్షవాహనంపై విహరించనున్నారు.

ఏప్రిల్‌ 19వ తేదీ శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా ఉదయం 7.00 గంటల నుండి 8.30 గంటల వరకు శ్రీ కోదండరాముడు భక్తాగ్రగణ్యుడైన హనుమంత వాహనంపై తిరువీధులలో విహరిస్తూ భక్తులకు అభయం ఇవ్వనున్నారు. అనంతరం ఉదయం 8.30 గంటల నుండి 9.00 గంటల వరకు శ్రీ కోదండరామస్వామి ఆలయంలో శ్రీరామనవమి ఆస్థానాన్ని ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు. తదనంతరం ఉదయం 10.30 గంటల నుండి 11.30 గంటల వరకు శ్రీ సీతారాముల కళ్యాణోత్సవం జరుగనుంది. ఈ కళ్యాణోత్సవంలో పాల్గొనదలచిన గృహస్థభక్తులు రూ.500/-లు చెల్లించి పాల్గొనవచ్చును. వీరికి ఒక లడ్డూ, ఒక ఉత్తరీయం, ఒక రవికె బహుమానంగా ఇస్తారు. సాయంత్రం 7.00 గంటల నుండి 9.00 గంటల వరకు సర్వభూపాల వాహనంపై స్వామివారు దర్శనమివ్వనున్నారు.

ఈ సందర్భంగా తితిదే హిందూధర్మప్రచార పరిషత్‌, అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో ప్రతిరోజూ సాయంత్రం 5.30 గంటల నుండి రాత్రి 9.00 గంటల వరకు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలైన హరికథ, అన్నమాచార్య సంకీర్తనలు, పండరి భజనలు, కోలాటాలు నిర్వహించనున్నారు.                                          

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.