వైభవంగా ముగిసిన శ్రీ పద్మావతి అమ్మవారి వసంతోత్సవాలు

వైభవంగా ముగిసిన శ్రీ పద్మావతి అమ్మవారి వసంతోత్సవాలు

తిరుపతి, మే 26, 2013: మూడు రోజుల పాటు జరిగిన తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక వసంతోత్సవాలు ఆదివారం వైభవంగా ముగిశాయి. చివరి రోజు కార్యక్రమాల్లో భాగంగా ఉదయం సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొలిపి సహస్రనామార్చన నిర్వహించారు. అనంతరం ఉత్సవర్లను ఊరేగింపుగా శుక్రవారపు తోటకు వేంచేపు చేశారు. మధ్యాహ్నం 3.00 గంటలకు స్నపనతిరుమంజనం నిర్వహించారు. ఇందులో భాగంగా పసుపు, కుంకుమ, పాలు, పెరుగు, తేనె, చందనం, పలురకాల పండ్లరసాలతో అభిషేకం చేశారు. సాయంత్రం 6.30 నుండి 7.30 గంటల వరకు అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో ఆధ్యాత్మిక సంగీత కార్యక్రమాలు నిర్వహించనున్నారు. రాత్రి 7.30 నుండి 8.30 గంటల వరకు ఉత్సవమూర్తులను ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగించనున్నారు.
ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ భాస్కర్‌రెడ్డి, ఏఈఓ శ్రీమతి నాగరత్న, సూపరింటెండెంట్‌ శ్రీ శేషగిరి, ఆర్జితం ఇన్‌స్పెక్టర్‌ శ్రీ వెంకటరమణారెడ్డి ఇతర అధికార ప్రముఖులు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
            
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.