వైభవంగా శ్రీ సుందరరాజస్వామివారి అవతార మహోత్సవాలు ప్రారంభం

వైభవంగా శ్రీ సుందరరాజస్వామివారి అవతార మహోత్సవాలు ప్రారంభం

తిరుపతి, జూన్‌ 28, 2013: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయానికి అనుబంధంగా ఉన్న శ్రీ సుందరరాజ స్వామివారి అవతార మహోత్సవాలు శుక్రవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు.

ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి సహస్రనామార్చన, శ్రీ పద్మావతి అమ్మవారి మూలవర్లకు అభిషేకం చేశారు. అనంతరం 10.30 నుండి 12.00 గంటల వరకు శ్రీ పద్మావతి అమ్మవారికి వేడుకగా కల్యాణోత్సవం నిర్వహించారు. మధ్యాహ్నం ముఖమండపంలో శ్రీ సుందరరాజ స్వామివారికి, శ్రీ పద్మావతి అమ్మవారికి వేరువేరుగా వైభవంగా అభిషేకం చేశారు. సాయంత్రం 5.30 నుండి 6.30 గంటల వరకు ఊంజల్‌ సేవ ఘనంగా జరుగనుంది. అనంతరం ఆలయ బయట గల వాహనమండపంలో శ్రీ సుందరరాజస్వామివారిని సర్వాంగ సుందరంగా అలంకరించి పెద్దశేష వాహనంపై వేంచేపు చేస్తారు. రాత్రి 7.15 నుండి 8.30 గంటల వరకు స్వామివారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులను కటాక్షించనున్నారు. కాగా శనివారం రాత్రి స్వామివారు హనుమంత వాహనాన్ని అధిరోహించి భక్తులకు దర్శనమివ్వనున్నారు.
ఈ కార్యక్రమంలో ఆలయ ఉప కార్యనిర్వహణాధికారి శ్రీ భాస్కర్‌రెడ్డి, సహాయ కార్యనిర్వహణాధికారి శ్రీమతి నాగరత్న, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
  –
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.