ANKURARPANAM HELD IN SRI KT _ శ్రీ కపిలేశ్వరాలయంలో పత్రపుష్పయాగానికి శాస్త్రోక్తంగా అంకురార్పణ
శ్రీ కపిలేశ్వరాలయంలో పత్రపుష్పయాగానికి శాస్త్రోక్తంగా అంకురార్పణ
తిరుపతి, 2024 మే 22: తిరుపతి శ్రీ కపిలేశ్వరాలయంలో మే 23వ తేదీ జరుగనున్న పత్రపుష్పయాగానికి బుధవారం సాయంత్రం శాస్త్రోక్తంగా అంకురార్పణ జరిగింది. ఈ సందర్భంగా విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవచనం, అంకురార్పణ, నవకలశస్థాపన కార్యక్రమాలు నిర్వహించారు.
మే 23న ఉదయం 7.30 నుండి 9.30 గంటల వరకు శ్రీ సోమస్కందమూర్తి, శ్రీ కామాక్షి అమ్మవారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. ఉదయం 10 నుండి మద్యాహ్నం 12 గంటల వరకు పత్రపుష్పయాగ మహోత్సవం జరుగనుంది. ఇందులో తులసి, చామంతి, గన్నేరు, మొగలి, సంపంగి, రోజా, కలువలు వంటి పలురకాల పుష్పాలు, పత్రాలతో అభిషేకం చేస్తారు. సాయంత్రం 6 నుండి రాత్రి 8 గంటల వరకు స్వామివారి తిరువీధి ఉత్సవం జరుగనుంది. గృహస్తులు(ఇద్దరు) రూ.200/- చెల్లించి పత్రపుష్పయాగంలో పాల్గొనవచ్చు.
ఆలయంలో బ్రహ్మోత్సవాలు, ఇతర ఉత్సవాల్లో అర్చక పరిచారకులు, భక్తుల వల్ల తెలియక జరిగిన పొరబాట్లకు ప్రాయశ్చిత్తంగా పత్రపుష్పయాగం నిర్వహిస్తారు.
ఈ కార్యక్రమంలో ఆలయ సూపరింటెండెంట్ శ్రీ క్రిష్ణవర్మ, టెంపుల్ ఇన్స్పెక్టర్ శ్రీ బాలకృష్ణ, అర్చకులు పాల్గొన్నారు.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.