శ్రీ కోదండరామాలయంలో ఘనంగా శ్రీరామనవమి వేడుకలు
శ్రీ కోదండరామాలయంలో ఘనంగా శ్రీరామనవమి వేడుకలు
తిరుపతి, ఏప్రిల్ 19, 2013: తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో శుక్రవారం శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరిగాయి. ఇందులో భాగంగాలో ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు.
తెల్లవారుజామున సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి ఉదయం 2.30 నుండి 4.00 గంటల వరకు పరిమళం ఊరేగింపు, మూలవర్ల తిరుమంజనం నిర్వహించారు. అనంతరం ఉదయం 10.00 గంటలకు ఊంజల్ మండపంలో స్వామి, అమ్మవారి ఉత్సవర్లకు తిరుమంజనం చేపట్టారు. మధ్యాహ్నం 3.00 నుండి 4.00 గంటల వరకు శ్రీరామ జనన ప్రవచనం, ఆస్థానం జరిగాయి. సాయంత్రం 6.30 నుండి 7.30 గంటల వరకు ఊంజల్సేవ అనంతరం ఉత్సవమూర్తులను వాహన మండపానికి వేంచేపు చేశారు. రాత్రి 8.30 నుండి 10.00 గంటల వరకు శ్రీరామచంద్రమూర్తి తన ప్రియభక్తుడైన హనుమంత వాహనాన్ని అధిష్టించి ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులను కటాక్షించనున్నారు.
ఈ కార్యక్రమంలో స్థానిక ఆలయాల ఉప కార్యనిర్వహణాధికారి శ్రీ చంథ్రేఖరపిళ్లై, తితిదే హిందూ ధర్మప్రచార పరిషత్ ప్రత్యేకాధికారి శ్రీ రఘునాధ్, గోవిందరాజస్వామి ఆలయ సహాయ కార్యనిర్వహణాధికారి శ్రీ ప్రసాదమూర్తిరాజు, ఆలయ సూపరింటెండెంట్ శ్రీ సురేష్రెడ్డి, టెంపుల్ ఇన్స్పెక్టర్ శ్రీ శేషారెడ్డి, పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.