సనాతన హిందూ ధార్మిక పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు 

సనాతన హిందూ ధార్మిక పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు

తిరుపతి ఫిబ్రవరి-21, 2009: తిరుమల తిరుపతి దేవస్థానముల హిందూ ధర్మప్రచార పరిషత్‌ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని పాఠశాలల్లో ఫిబ్రవరి 22వ తేదిన సనాతన హిందూ ధార్మిక పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు ధర్మప్రచార పరిషత్‌ కార్యదర్శ డా||చిలకపాటి విజయరాఘవాచార్యులు ఒక ప్రకటనలో తెలిపారు.

రాష్ట్రంలోని అన్ని పాఠశాలలో చదువుతున్న విద్యార్థినీ విద్యార్థులకు 6,7వ తరగతి విద్యార్థినీ విద్యార్థులకు ధర్మపరిచయం, 8,9,10వ తరగతి విద్యార్థులకు ధర్మప్రవేశిక పరీక్షలను నిర్వహిస్తారు. ఈ పరీక్షలకు గాను చిత్తూరు జిల్లానుండి ఎక్కువస్థాయిలో 19,034 మందికాగా, రంగారెడ్డి జిల్లా నుండి 1300 మంది విద్యార్థినీ విద్యార్థులు హాజరు కానున్నారు. రాష్ట్ర మొత్తంమీద ఈ పరీక్షకు రేపు 1,37,808 మంది విద్యార్థినీ, విద్యార్థులు పరీక్షలు వ్రాయనున్నారు. ఆయా జిల్లాల్లోని మండల విద్యాశాఖాధికారుల సమన్వయంతో, జిల్లా విద్యాశాఖాధికారుల సహకారంతో ఈ పరీక్షలు నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. రాష్ట్రంలోని అన్ని సోషియల్‌ వెల్ఫేర్‌ రెసిడెన్షియల్‌ పాఠశాలలు, ఏ.పి.రెసిడ్‌న్షియల్‌ పాఠశాలలు, గిరిజన సంక్షేమ రెసిడెన్షియల్‌ పాఠశాలల్లో చదివే విద్యార్థినీ విద్యార్థులు కూడా ఈ పరీక్షలకు హాజరవుతుండడం ఒక విశేషమని కార్యదర్శి తెలిపారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.