శ్రీ కల్యాణవెంకన్న పుష్పయాగానికి ఘనంగా అంకురార్పణ

శ్రీ కల్యాణవెంకన్న పుష్పయాగానికి ఘనంగా అంకురార్పణ

మార్చి 13, తిరుపతి, 2018: శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో వార్షిక పుష్పయాగానికి మంగళవారం సాయంత్రం ఘనంగా అంకురార్పణ జరుగనుంది. సాయంత్రం 6 నుంచి రాత్రి 8 గంటల వరకు మృత్సంగ్రహణం, సేనాధిపతి ఉత్సవం, అంకురార్పణ కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించనున్నారు.

మార్చి 14వ తేదీ బుధవారం ఉదయం 7 నుండి 10 గంటల వరకు యాగశాలలో వైదిక కార్యక్రమాలు, ఉదయం 10.30 నుండి 12 గంటల వరకు శ్రీదేవి భూదేవి సమేత కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. మధ్యాహ్నం 2.30 నుండి 5 గంటల వరకు పుష్పయాగం కన్నులపండుగగా జరుగనుంది. సాయంత్రం 6.30 నుండి 7.30 గంటల వరకు వీధి ఉత్సవం నిర్వహిస్తారు. రూ.516/- చెల్లించి పుష్పయాగంలో పాల్గొనే గ హస్తులకు(ఇద్దరు) రవికె, ఉత్తరీయం బహుమానంగా అందజేస్తారు. పుష్పయాగం కారణంగా మార్చి 14వ తేదీన అష్టోత్తర శతకలశాభిషేకం, ఆర్జిత కల్యాణోత్సవం సేవలను టిటిడి రద్దు చేసింది.

ఆలయంలో ఫిబ్రవరి 6 నుంచి 14వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు జరిగిన విషయం తెలిసిందే. బ్రహ్మోత్సవాల్లో అర్చక పరిచారకుల వల్ల, అధికార అనధికారుల వల్ల, భక్తుల వల్ల ఏవైనా లోపాలు జరిగి ఉంటే వాటికి ప్రాయశ్చిత్తంగా పుష్పయాగం నిర్వహిస్తారు. ఈ యాగం నిర్వహణ వల్ల సమస్తదోషాలు తొలగిపోతాయని అర్చకులు తెలిపారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.