ANKURARPANAM IN CONNECTION WITH ANNUAL PAVITHROTSAVAM _ తిరుమలలో పవిత్రోత్సవాలకు అంకురార్పణ
తిరుమలలో పవిత్రోత్సవాలకు అంకురార్పణ
తిరుమల, 16 ఆగష్టు 2013 : శ్రీ వేంకటాద్రి యందు అర్చావమూర్తిగా వెలసివున్న శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో పవిత్రపదమైన శ్రావణ మాసమున ప్రతియేటా3 రోజులపాటు జరిగే పవిత్రోత్సవాలకు ముందురోజు నిర్వహించే అంకురార్పణ కార్యక్రమం శుక్రవారంనాడు తిరుమల శ్రీవారి ఆలయంలోని యాగశాల (పవిత్రమండపం) నందు రాత్రి అత్యంత వైభవంగా జరగనుంది.
కాగా పవిత్రోత్సవాల్లో తొలిరోజైన ఆగష్టు 17వ తారీఖున శ్రీవారి ఆలయంలోని యాగశాలలో ఉదయం 7 గంటలకు హోమాన్ని నిర్వహించి పవిత్ర ప్రతిష్ట చేయనున్నారు. అనంతరం స్నపనతిరునమంజనం కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. రెండవరోజు మధ్యాహ్నం 12 గంటల నుండి 2 గంటల నడుమ పవిత్రము ఊరేగింపు, మూలవరులకు మరియు ఉత్సవరులకు పవిత్రాల సమర్పణ కార్యక్రమం జరుగుతుంది. చివరిరోజు పూర్ణాహుతి హోమంతో ఈ కార్యక్రమాలు ముగియనున్నాయి.
అంకురార్పణ సందర్భంగా శుక్రవారంనాడు జరిగే వసంతోత్సవం మరియు సహస్రదీపాలంకార సేవలను రద్దు చేసింది. పవిత్రోత్సవాల నేపథ్యంలో ఆగష్టు 17 నుండి 19 వరకు శ్రీవారి ఆలయంలో నిర్వహించే ఆర్జిత సేవలైన కల్యాణోత్సవం, ఊంజల్సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, వసంతోత్సవం మరియు సహస్రదీపాలంకార సేవలను తి.తి.దే రద్దు చేసింది. ఈ నాలుగు రోజులపాటు తోమాల మరియు అర్చన సేవలను ఏకాంతంలో నిర్వహించనున్నారు.