CULTURAL PROGRAMMES SHOULD PRONOUNCE THE GLORY OF TIRUMALA-TIRUMALA JEO _ బ్రహ్మోత్సవాల్లో సాంస్కృతిక కార్యక్రమాలతో శ్రీవారి వైభవాన్ని చాటాలి : తిరుమల జెఈవో శ్రీ కె.ఎస్.శ్రీనివాసరాజు
బ్రహ్మోత్సవాల్లో సాంస్కృతిక కార్యక్రమాలతో శ్రీవారి వైభవాన్ని చాటాలి : తిరుమల జెఈవో శ్రీ కె.ఎస్.శ్రీనివాసరాజు
తిరుపతి, సెప్టెంబరు 10, 2013: అక్టోబరు 5 నుండి 13వ తేదీ వరకు జరుగనున్న శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో విశిష్టమైన ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా స్వామివారి వైభవాన్ని ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పాలని తితిదే తిరుమల సంయుక్త కార్యనిర్వహణాధికారి శ్రీ కె.ఎస్.శ్రీనివాసరాజు కోరారు. తిరుపతిలోని శ్రీ పద్మావతి అతిథిగృహంలో మంగళవారం ఆయన తితిదే ఆధ్వర్యంలోని అన్ని ప్రాజెక్టుల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా జెఈవో మాట్లాడుతూ వాహనసేవల సమయంలో అన్ని భాషల్లో వాహనం విశిష్టతపై వ్యాఖ్యానం అందించాలని ఆదేశించారు. అన్ని ప్రాజెక్టుల అధికారులు సమన్వయం చేసుకుని నాణ్యమైన ఆధ్యాత్మిక, ధార్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని సూచించారు. సెప్టెంబరు 19వ తేదీన పౌర్ణమి సందర్భంగా తిరుమలలో బ్రహ్మోత్సవం తరహాలో నిర్వహించే మాదిరి గరుడసేవలో ప్రయోగాత్మకంగా నాణ్యమైన సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్లో వాహనసేవలను ప్రత్యక్ష ప్రసారం చేయాలని, అనుభవజ్ఞులతో వ్యాఖ్యానం చేయించాలని, తిరుమలలో జరిగే ఇతర కార్యక్రమాలను నాణ్యంగా భక్తులకు అందించాలని ఆదేశించారు. తిరుమలలోని నాదనీరాజనం వేదికపై ప్రసిద్ధిచెందిన కళాకారులతో సంగీత, నృత్య కార్యక్రమాలు, ఆస్థానమండపంలో వేదవిద్వత్ సదస్సులు, ధార్మిక ఉపన్యాసాలు ఏర్పాటు చేయాలన్నారు. ఇటీవల తిరుపతిలో జరిగిన యువలయం సంగీత యువజనోత్సవంలో విజేతలైన కళాకారులతో బ్రహ్మోత్సవాల సమయంలో నాదనీరాజనం వేదికపై కార్యక్రమం నిర్వహించనున్నట్టు జెఈవో తెలిపారు.
తిరుపతి సంయుక్త కార్యనిర్వహణాధికారి శ్రీ పి.వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ జిల్లా ధర్మప్రచార మండళ్ల ఆధ్వర్యంలో, తితిదే కల్యాణమండపాల్లో భజనలు, ధార్మిక ఉపన్యాసాలు, సంగీత, సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా స్వామివారి బ్రహ్మోత్సవాలకు విస్తృత ప్రచారం కల్పించాలని కోరారు. వాహనసేవల సమయంలో గ్యాలరీల్లో వేచి ఉండే భక్తులకు వాహనసేవల విశిష్టతను తెలిపే పుస్తకాలు, విష్ణుసహస్రనామావళి ఇతర ఆధ్యాత్మిక పుస్తకాలు ఉచితంగా అందించాలన్నారు. తిరుపతిలోని భక్తులను దృష్టిలో ఉంచుకుని మహతి కళాక్షేత్రం, అన్నమాచార్య కళామందిరం, శ్రీరామచంద్ర పుష్కరిణి వద్ద నృత్యరూపకాలు, ధార్మిక ఉపన్యాసాలు ఇతర ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో తితిదే ముఖ్య నిఘా మరియు భద్రతాధికారి శ్రీ జివిజి.అశోక్కుమార్, అన్నమాచార్య ప్రాజెక్టు ఇన్చార్జ్ సంచాలకులు శ్రీ మునిరత్నంరెడ్డి, హిందూ ధర్మప్రచార పరిషత్ ప్రత్యేకాధికారి శ్రీ రఘునాథ్, డెప్యూటీ ఈవో శ్రీ ఉమాపతిరెడ్డి, దాససాహిత్య ప్రాజెక్టు ప్రత్యేకాధికారి శ్రీ ఆనందతీర్థాచార్యులు, ఎస్వీ సంగీత కళాశాల ప్రిన్సిపాల్ శ్రీమతి చల్లా ప్రభావతి ఇతర అధికారులు పాల్గొన్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.