ఆకట్టుకున్న దాససాహిత్య ప్రాజెక్టు కళాకారుల సంకీర్తనాలాపన

ఆకట్టుకున్న దాససాహిత్య ప్రాజెక్టు కళాకారుల సంకీర్తనాలాపన

ఆగస్టు 02, తిరుమల 2018: టిటిడి దాససాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో తిరుమలలోని కళ్యాణవేదికలో నిర్వహిస్తున్న శ్రీ జయతీర్థుల ఆరాధనోత్సవాల్లో భాగంగా రెండో రోజు గురువారం కళాకారుల సంకీర్తనాలాపన ఆకట్టుకుంది.

ఈ సందర్భంగా బెంగళూరులోని శ్రీరాఘవేంద్ర మఠాధిపతి శ్రీశ్రీశ్రీ సువిద్యేంద్రతీర్థ స్వామీజీ, ఉడిపిలోని తీర్థహళ్లి భీమసేతు మునివృంద మఠాధిపతి శ్రీశ్రీశ్రీ రఘువరేంద్రతీర్థ స్వామీజీ మంగళాశాసనాలు చేస్తూ శ్రీ జయతీర్థులు మానవాళికి అందించిన సందేశాన్ని వివరించారు. శ్రీజయతీర్థులు సంస్కృతంలో గ్రంథరచన చేయగా, శ్రీ పురందరదాసులు కన్నడలోకి అనువదించి సంకీర్తనలు రచించారని తెలిపారు. మానవాళి కామాక్రోధాన్ని తగ్గించుకుని మానవత్వాన్ని పెంచుకోవాలన్నారు. ప్రతి ఒక్కరూ సత్‌ బుద్ధి, జ్ఞానం పెంచుకుని లోకకల్యాణం కోసం పాటుపడాలన్నారు.

ఆరాధనోత్సవాల్లో భాగంగా ఉదయం సుప్రభాతం, ధ్యానం, శ్రీజయతీర్ధుల సంకీర్తన కార్యక్రమాలు నిర్వహించారు. మధ్యాహ్నం సామూహిక సంకీర్తనాలాపన, సంగీత విభావరి చేపట్టారు.

టిటిడి దాససాహిత్య ప్రాజెక్టు ప్రత్యేకాధికారి శ్రీ పి.ఆర్‌.ఆనందతీర్థాచార్య ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలకు చెందిన మూడు వేల మందికి పైగా భజన మండళ్ల సభ్యులు పాల్గొన్నారు.

తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.