బ్రహ్మోత్సవాలకు ఏకశిలానగరం ముస్తాబు
– పురాతన చారిత్రక ప్రాశస్త్యం
– శాస్త్రోక్తంగా అంకురార్పణ
– మార్చి 31న ధ్వజారోహణం
తిరుపతి 30 మార్చి 2023: తిరుమల తిరుపతి దేవస్థానానికి చెందిన వైఎస్సార్ జిల్లా ఒంటిమిట్టలోని శ్రీకోదండరామస్వామివారి ఆలయం వార్షిక శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలకు ముస్తాబైంది. ఈ ఆలయానికి పురాతన, చారిత్రక ప్రాశస్త్యం ఉంది. ఒకే శిలపై సీతారామ లక్ష్మణ దేవతామూర్తులు ఉండడం వల్ల ఒంటిమిట్టను ఏకశిలానగరం అని కూడా అంటారు. మార్చి 31 నుండి ఏప్రిల్ 9వ తేదీ వరకు జరుగనున్న వార్షిక శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలకు గురువారం రాత్రి శాస్త్రోక్తంగా అంకురార్పణ జరిగింది.
ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి, పరివార దేవతలకు తిరుమంజనం నిర్వహించారు. అనంతరం మూలవర్లకు వ్యాసాభిషేకం, ఆరాధన, అర్చన చేశారు. సాయంత్రం 6 నుండి అర్చకుల వేదమంత్రాల నడుమ శాస్త్రోక్తంగా అంకురార్పణ నిర్వహించారు. ఇందులో భాగంగా శ్రీ సీతారామ లక్ష్మణ ఉత్సవమూర్తులను సర్వాంగ సుందరంగా అలంకరించి ప్రత్యేక వేదికపై కొలువుదీర్చి విష్వక్సేన పూజ, కలశం ప్రతిష్ట, కలశపూజ, వాసుదేవ పుణ్యాహవచనం, కంకణధారణ చేశారు. అనంతరం పుట్టమన్ను సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. కంకణభట్టార్ శ్రీ కెహెచ్.రాజేష్ కుమార్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.
మార్చి 31న ధ్వజారోహణం
మార్చి 31వ తేదీ శుక్రవారం ఉదయం 8 నుండి 9 గంటల మధ్య వృషభ లగ్నంలో ధ్వజారోహణం జరుగనుంది. సాయంత్రం 3 నుండి 5 గంటల వరకు కవి సమ్మేళనం, రాత్రి 7 నుండి 9 గంటల వరకు శేష వాహనసేవ నిర్వహిస్తారు. ప్రతిరోజూ ఉదయం 8 నుండి 10 గంటల వరకు, రాత్రి 7 నుండి 9 గంటల వరకు వాహనసేవలు జరుగనున్నాయి.
ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ నటేష్ బాబు, సూపరింటెండెంట్లు శ్రీ వెంకటేశయ్య, శ్రీ ఆర్సి సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.
ఆకట్టుకున్న పోతన భాగవతం కవిసమ్మేళనం
శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకొని ఒంటిమిట్ట శ్రీ కోదండరామాలయం వద్ద నిర్వహించిన పోతన భాగవతం కవి సమ్మేళనం భక్తులను ఎంతగానో ఆకట్టుకుంది. టిటిడి ధార్మిక ప్రాజెక్టుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా పోతన సాహిత్య పీఠం కార్యదర్శి శ్రీ నారాయణ రెడ్డి ‘రుక్మిణి సందేశం’, డా.బి.గోపాలకృష్ణ శాస్త్రి ‘శ్రీరామ జననం’, డా.కె.సుమన ‘సీతారామ కళ్యాణం’, శ్రీ పి.శంకర్ ‘భక్తరసం’, శ్రీ వి.చిన్నయ్య ‘కుచేలోపాఖ్యానం’, శ్రీ ఎం.లోకనాథం ‘శరణాగతితత్వం’ అనే అంశాలపై ఉపన్యసించారు.
ఈ కార్యక్రమంలో టిటిడి ధార్మిక ప్రాజెక్టుల ప్రోగ్రాం అధికారి శ్రీ రాజగోపాల్ రావు, ప్రాజెక్టు అధికారి శ్రీమతి విజయలక్ష్మి, ఏఈఓ శ్రీ శ్రీరాములు, ప్రోగ్రాం అసిస్టెంట్ శ్రీ రామాచారి తదితరులు పాల్గొన్నారు.
ఆలయ చరిత్ర
పురాణాల ప్రకారం ఆలయ చరిత్ర ఇలా ఉంది. శ్రీమహావిష్ణువు త్రేతాయుగంలో శ్రీరామచంద్రునిగా అవతరించాడు. సీతాలక్ష్మణ సమేతుడై దండకారణ్యంలో సంచరిస్తుండగా సీతాదేవి దప్పిక తీర్చేందుకు భూమిలోనికి బాణం వేయగా నీరు బుగ్గ పుట్టింది. అదే ఒంటిమిట్ట రామతీర్థం అయింది. సీతాన్వేషణ కోసం జాంబవంతుడు సహకరించాడు. ఆ జాంబవంతుడు సేవించిన సీతాలక్ష్మణ సమేత శ్రీ రామచంద్రుడే ఒంటిమిట్ట గుడిలో కొలువై ఉన్నాడు.
శాసనాల ప్రకారం :
ఈ ఆలయాన్ని మూడు దశల్లో నిర్మించారని, 14వ శతాబ్దంలో నిర్మాణం ప్రారంభమై 17వ శతాబ్దంలో పూర్తయిందని ఇక్కడున్న శాసనాల ద్వారా తెలుస్తోంది. ఉదయగిరిని పాలించిన కంపరాయలు ఈ ప్రాంతంలో ఒకసారి సంచరిస్తాడు. వేట మీద జీవనం సాగించే వంటడు, మిట్టడు ఇక్కడికొచ్చిన కంపరాయలకు, ఆయన పరివారానికి శ్రీరాముడు సృష్టించిన బుగ్గనీటితో దప్పిక తీరుస్తారు. వీరిరువురి కోరికపై కంపరాయలు ఆలయాన్ని నిర్మించి ఒంటిమిట్ట గ్రామాన్ని ఏర్పాటుచేస్తాడు. క్రీ.శ 1356లో బుక్కరాయలు ఈ ఆలయాన్ని ప్రారంభించాడు.
ఆ తరువాత కాలంలో విజయనగరరాజులు, మట్లిరాజులు క్రమంగా గుడికి అంతరాళం, రంగమంటపం, మహాప్రాంగణం, గోపురం, రథం నిర్మించారు. ఒంటిమిట్ట చుట్టుపక్కల గ్రామాల రాబడిని ఆలయ కైంకర్యాలకు వినియోగించారు. వావిలికొలను సుబ్బారావు భిక్షాటన చేసి విరాళాలు సేకరించి ఆలయానికి పూర్వ వైభవం తెచ్చారు.
రాములవారిపై సాహిత్యం :
ఎందరో మహాకవులు తన సాహిత్యం ద్వారా శ్రీరామచంద్రుని కరుణకు పాత్రులయ్యారు. పోతన ఇక్కడే భాగవతాన్ని అనువదించినట్టు తెలుస్తోంది. అయ్యలరాజు తిప్పయ్య ఒంటిమిట్ట రఘువీర శతకం చెప్పారు. రామభద్రుడు ‘రామాభ్యుదయం’ రచించారు. నల్లకాల్వ అయ్యప్ప ఒంటిమిట్ట రాముని వరం పొంది వరకవి అయ్యారు. ఉప్పు గొండూరు వేంకటకవి ఒంటిమిట్ట రశరథరామ శతకం చెప్పారు. వావిలికొలను సుబ్బారావు ఆంధ్రవాల్మీకి రామాయణాన్ని మందర వ్యాఖ్యతో రచించారు. తాళ్లపాక అన్నమయ్య రామునిపై పలు సంకీర్తనలు ఆలపించారు.
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.