వైభవంగా శ్రీ కోదండరాముని తెప్పోత్సవాలు ప్రారంభం

వైభవంగా శ్రీ కోదండరాముని తెప్పోత్సవాలు ప్రారంభం

మార్చి 29, తిరుపతి, 2018: తిరుపతిలోని శ్రీకోదండరామస్వామివారి తెప్పోత్సవాలు గురువారం శ్రీరామచంద్ర పుష్కరిణిలో వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఇందులో భాగంగా ఉదయం 9.30 నుండి 11 గంటల వరకు స్నపన తిరుమంజనం శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనం, కొబ్బరి నీళ్లతో విశేషంగా అభిషేకం చేశారు.

సాయంత్రం 5 గంటలకు శ్రీ సీతారామలక్ష్మణుల ఉత్సవమూర్తులను ఊరేగింపు శ్రీగోవిందరాజస్వామివారి ఆలయానికి తీసుకెళ్లి ఆస్థానం, ఖనిజంతోట ఉత్సవం నిర్వహించారు. అక్కడినుండి ఉత్సవమూర్తులను రామచంద్ర పుష్కరిణికి వేంచేపు చేశారు. రాత్రి 7 నుండి 8.30 గంటల వరకు తెప్పోత్సవం నిర్వహించారు. విద్యుద్దీపాలతో సర్వాంగసుందరంగా అలంకరించిన తెప్పపై శ్రీ సీతారామలక్ష్మణులు ఆశీనులై ఐదుచుట్లు తిరిగి భక్తులను అనుగ్రహించారు.

ఈ కార్యక్రమంలో టిటిడి స్థానిక ఆలయాల డెప్యూటీ ఈవో శ్రీమతి ఝాన్సీరాణి, సూపరింటెండెంట్‌ శ్రీ మునికృష్ణారెడ్డి, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్లు శ్రీ శేషారెడ్డి, శ్రీ మురళీకృష్ణ ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.


టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.