GOLD PLATING WORKS BEGINS FOR SWARNA RATHAM _ శ్రీవారి స్వర్ణరథానికి బంగారు తాపడం ప్రారంభం
శ్రీవారి స్వర్ణరథానికి బంగారు తాపడం ప్రారంభం
తిరుమల, 26 ఆగష్టు 2013 : శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలచే శ్రీవారి స్వర్ణరథం యొక్క నూతన బంగారు తాపడం పనులు సోమవారంనాడు శాస్త్రోక్తంగా ప్రారంభమయ్యాయి.
తి.తి.దే ఇ.ఓ శ్రీ యం.జి గోపాల్, తిరుమల జె.ఇ.ఓ శ్రీ కె.ఎస్.శ్రీనివాసరాజు బంగారు తాపడం పనులను తిరుమల ఎస్.వి.మ్యూజియంలో ప్రత్యేక పూజలుచేసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా తి.తి.దే ఇ.ఓ శ్రీ గోపాల్ మాట్లాడుతూ భక్తులందరూ ఎంతో కాలంగా నిరీక్షిస్తున్న స్వర్ణరథం బంగారు తాపడం పనులు నేడు ప్రారంభం కావడం విశేషమన్నారు.
దాదాపు 25 కోట్ల రూపాయల వ్యంయంతో తయారువుతున్న ఈ స్వర్ణరథానికి 73 కిలోల బంగారం, 2900 కిలోల రాగిని ఉపయోగించి పాత చెక్క రథానికే నూతన బంగారు తాపడం చేయటం జరుగుతుందన్నారు. ఈ ఏడాది బ్రహ్మోత్సవాలకల్లా ఈ స్వర్ణరథం సిద్ధమై ఊరేగించనున్నట్లు తెలిపారు.
అనంతరం జె.ఇ.ఓ మాట్లాడుతూ అత్యంత భారీ భద్రతల నడుమ బంగారు తాపడం పనులు జరుగుతాయన్నారు. రానున్న 25 రోజుల్లో ఈ రథం సిద్ధం అవుతుందన్నారు. తరువాత సెప్టంబర్ చివరి వారంలో ఈ రథంతో ప్రయోగాత్మక పరీశీలనను తిరుమాడ వీధుల్లో నిర్వహిస్తామన్నారు.
కాగా కేరళాలోని పాలక్కాడుకు చెందిన శ్రీ ఎస్.ఏ.టి. మీనన్ పర్యవేక్షణలో 16 మంది నిపుణులైన ఆచారులు ఈ బృహత్కార్యక్రమం చేయనున్నారు. వీరందరూ బంగారు తాపడం పనులలో దాదాపు 40 ఏళ్ళ అనుభవం ఉన్నవారు కావడం విశేషం. కాగా ఈ నిపుణులు తమిళనాడులోని కుంభకోణం, మధురైకి చెందినవారు.
ఈ కార్యక్రమంలో అదనపు ఆర్థిక ముఖ్యగణాంకాధికారి శ్రీ ఓ.బాలాజీ, అదనపు సి.వి.ఎస్.ఓ శ్రీ శివకుమార్ రెడ్డి, ఎస్.ఇలు సుధాకర్ రావు, రమేశ్ రెడ్డి, ఆలయ డిప్యూటి.ఇ.ఓ శ్రీ చిన్నంగారి రమణ తదితరులు పాల్గొన్నారు.
తి.తి.దే ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.