JEO INSPECTS SRIVARI TEMPLE AND DHYANMANDIR IN NEW DELHI _ మే 29న న్యూఢిల్లీలో శ్రీవారి ఆలయం ప్రారంభం
మే 29న న్యూఢిల్లీలో శ్రీవారి ఆలయం ప్రారంభం
తిరుపతి, మే 24, 2013: ప్రపంచ ప్రసిద్ధిగాంచిన క్షేత్రంగా భాసిల్లుతున్న తిరుమల తిరుపతి దేవస్థానం మే 29వ తేదీన దేశ రాజధాని నగరం న్యూఢిల్లీలో శ్రీవారి ఆలయాన్ని ప్రారంభించనుంది. న్యూఢిల్లీలోని కాలిబడి ప్రాంతంలో ఉన్న ఉద్యాన్మార్గ్ వద్ద కేంద్రీయ విద్యాలయం ఎదురుగా ఆధ్యాత్మికత ఉట్టిపడేలా సకల హంగులతో తితిదే ఈ ఆలయాన్ని నిర్మించింది. ఉత్తరాది భక్తులకు తిరుమల శ్రీవారి ఆశీస్సులు అందించేందుకు తితిదే ఈ ఆలయ నిర్మాణాన్ని చేపట్టింది. ఆలయం ప్రారంభం సందర్భంగా మూడు రోజుల పాటు న్యూఢిల్లీలో ప్రత్యేక కార్యక్రమాలను తితిదే నిర్వహిస్తోంది.
మే 29వ తేదీన ఉదయం 8.00 నుండి 9.00 గంటల వరకు ప్రాణప్రతిష్ఠ, విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం జరుగనుంది. అనంతరం శ్రీ వేంకటేశ్వరస్వామివారు, శ్రీ మహాలక్ష్మి, శ్రీభూదేవి అమ్మవారు, శ్రీ గరుడాళ్వార్, ధ్వజస్తంభ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం నిర్వహించనున్నారు. మధ్యాహ్నం భక్తులకు తీర్థప్రసాద వితరణ చేస్తారు. సాయంత్రం ధార్మికోపన్యాసాలు నిర్వహించనున్నారు.
మే 30వ తేదీన శ్రీవారి ఆలయం వద్ద తితిదే పాలకమండలి అధ్యకక్షులు శ్రీ కనుమూరి బాపిరాజు ధ్యానమందిరాన్ని ప్రారంభించనున్నారు. ఆలయ నిర్మాణ స్థలదాత శ్రీ నిర్మల్ సేథియ సమక్షంలో ఈ కార్యక్రమం జరుగనుంది. అనంతరం మధ్యాహ్నం భక్తులకు తీర్థప్రసాద వితరణ, సాయంత్రం ధార్మికోపన్యాసాలు నిర్వహిస్తారు.
జూన్ ఒకటో తేదీన న్యూఢిల్లీలోని ధౌలాకాన్ ప్రాంతంలోని శ్రీ వేంకటేశ్వర కళాశాల మైదానంలో సాయంత్రం 6.00 నుండి 8.00 గంటల వరకు శ్రీనివాస కల్యాణం వేడుకగా జరుగనుంది.
ఆలయ పనులను పరిశీలించిన తిరుపతి జెఈవో :
న్యూఢిల్లీలో ప్రారంభించనున్న శ్రీవారి ఆలయ పనులను తితిదే తిరుపతి సంయుక్త కార్యనిర్వహణాధికారి శ్రీ పి.వెంకట్రామిరెడ్డి శుక్రవారం పరిశీలించారు. ఎక్కడా రాజీ పడకుండా నాణ్యత పాటించాలని అధికారులకు సూచించారు. కాగా వారం రోజుల పాటు జరుగనున్న ఆలయ ప్రారంభ కార్యక్రమాలకు శుక్రవారం సాయంత్రం అంకురార్పణ జరిగింది. తితిదే కార్యనిర్వహణాధికారి శ్రీ ఎల్వీ సుబ్రమణ్యం ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.