JEO INSPECTS TRIAL RUN OF TEPPOTSAVAMS _ తెప్పోత్సవ ఏర్పాట్లను పరిశీలించిన తిరుమల జె.ఇ.ఓ
తెప్పోత్సవ ఏర్పాట్లను పరిశీలించిన తిరుమల జె.ఇ.ఓ
తిరుమల, 19 మార్చి – 2013: ఈ నెల 23వ తారీఖు నుండి 27వ తారీఖు వరకు తిరుమలలో జరుగనున్న శ్రీవారి వార్షిక తెప్పోత్సవ ఏర్పాట్లను తిరుమల జె.ఇ.ఓ శ్రీ కె.ఎస్.శ్రీనివాసరాజు మంగళవారంనాడు స్వామివారి పుష్కరిణిలో తణికీ చేశారు.
ఆనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ, తొలిసారిగా తి.తి.దే తెప్పోత్సవాలకు ఎక్కువ నిష్పత్తి కలిగిన ‘పాలి ఎథిలిన్’ డ్రమ్స్ను వినియోగిస్తున్నదన్నారు. ముంబయికి చెందిన ‘లిట్మాస్ మెరైన్ కంపెనీ’ వారి దగ్గర నుండి 360 డ్రమ్ములను, సబ్సిడీ ధరపై రూపాయలు 31 లక్షలతో తి.తి.దే కొనుగోలు చేసిందన్నారు. ఈ డ్రమ్ములు దాదాపు 24 టన్నుల భరువును అతి సునాయాసంగా మోయగలవన్నారు. ఈ డ్రమ్ములను తెప్పల క్రింద అమర్చి, పైన మందిరాన్ని ఏర్పాటు చేసి శ్రీ మలయప్ప స్వామివారి తెప్పోత్సవాలను కన్నుల పండుగగా నిర్వహించనున్నామని తెలిపారు. అనంతరం ఆయన తెప్పలను స్వామివారి పుష్కరిణిలో ప్రయోగాత్మకంగా పరిశీలించారు.
ఈ కార్యక్రమంలో ముఖ్యనిఘా మరియు భద్రతాధికారి శ్రీ జి.వి.జి అశోక్కుమార్, అదనపు ముఖ్యనిఘా మరియు భద్రతాధికారి శ్రీ శివకుమార్ రెడ్డి వెంట ఉన్నారు.
తెప్పోత్సవ వైశిష్ట్యంః- సర్వజగద్రక్షకుడైన స్వామివారు స్వామి పుష్కరిణిలో తన అనేక అవతార వైభవంతో ఐదు రోజులపాటు సంధ్యాసమయమున తెప్పపై ఆనంద విహారం చేయడమే తెప్పోత్సవం. ఈ తెప్పోత్సవాలు 23వ తేది శనివారం సాయంత్రం తిరుమలలో అంగరంగ వైభవంగా ప్రారంభం కానున్నాయి.
చారిత్రక నేపథ్యాన్ని పరిశీలిస్తే తెప్పోత్సవాలు అత్యంత ప్రాచీనకాలం నుండి జరుగుతున్నాయని తెలుస్తున్నది. అయితే కీ.శ 1468లో పుష్కరిణి మధ్యలో సాళువ నరసింహరాయలు ”నీరాళి మండపాన్ని” నిర్మించి తెప్పోత్సవాలకు అనువుగా తీర్చిదిద్దాడు. కాగా ప్రతి సంవత్సరం పాల్గుణమాసంలో శుద్ధ ఏకాదశి నుండి పౌర్ణమి వరకు ఐదు రోజులపాటు తెప్పోత్సవాలనుతి.తి.దే ఘనంగా నిర్వహిస్తుంది.
తొలిరోజు సాయంత్రం స్వామివారు శ్రీ సీత లక్ష్మణ ఆంజనేయ సమేతంగా శ్రీరామచంద్ర అవతారంలో స్వామి పుష్కరిణిలో తెప్పపై ఊరేగుతూ భక్తులకు కనువిందు చేస్తారు. ఈ సందర్భంగా స్వామివారు మూడుమార్లు పుష్కరిణిలో ప్రదక్షిణంగా విహరిస్తారు. రెండవ రోజు ద్వాదశినాడు రుక్మిణీ సమేతంగా శ్రీకృష్ణస్వామి అవతారంలో పురవీధులలో ప్రదక్షిణంగా ఊరేగుతూ వచ్చి మరలా పుష్కరిణిలో తెప్పపై మూడుమార్లు విహరిస్తారు.
ఇక మూడవరోజు త్రయోదశినాడు శ్రీభూ సమేతంగా మలయప్పస్వామివారు తిరుచ్చినెక్కి సర్వాలంకార భూషితుడై పురవీధుల్లో ఊరేగిన అనంతరం కోనేటిలోని తెప్పపై ఆశీనుడై మూడుమార్లు విహరిస్తూ భక్తులను అనుగ్రహిస్తాడు. ఇదే విధంగా మలయప్ప నాల్గవ రోజు ఐదు ప్రదక్షిణలు చివరి రోజు తెప్పపై పుష్కరిణిలో ఏడుమార్లు విహరించి భక్తులను కటాక్షిస్తాడు.
ఈ తెప్పోత్సవం కారణంగా శ్రీవారి ఆర్జిత సేవలైన వసంతోత్సవం, సహస్రదీపాలంకార సేవలను తి.తి.దే రద్దు చేసింది
తి.తి.దే ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.