MOHINI MESMERIZES DEVOTEES_ మోహినీ అవతారంలో సర్వలోక రక్షకుడు

Srinivasa Mangapuram, 28 February 2019: On the fifth day morning as a part of ongoing annual brahmotsavams in Srinivasa Mangapuram, Sri Kalyana Venkateswara Swamy donned the guise of Universal Divine Damsel, Mohini to charm the devotees.

Mohini Avatara has a unique significance in Hindu mythology, as it is the only incarnation of Lord Maha Vishnu as a celestial beauty to get sacred nectar produced out of churning of milk ocean to the deities.

Lord in all His celestial splendour decked with dazzling jewels and clothes blessed devotees on Thursday morning.

Temple DyEO Sri Dhananjeyulu, AEO Sri Lakshmaiah, Suptd Sri Muni Chengalrayulu, Temple Inspector Sri Anil and others took part.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI

మోహినీ అవతారంలో సర్వలోక రక్షకుడు

తిరుపతి,2019 ఫిబ్రవరి 28: శ్రీనివాసమంగాపురంలోని శ్రీకల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో ఐదో రోజైన గురువారం ఉదయం శ్రీ‌నివాసుడు మోహినీ అవతారంలో పల్లకీలో, తిరుచ్చిపై చిన్ని కృష్ణుడు ఊరేగుతూ భక్తులకు అభయమిచ్చారు. ఉదయం 8.00 గంటల నుండి 9.00 గంటల వరకు స్వామివారు నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. పల్లకీ ముందు గజరాజులు ఠీవిగా నడుస్తుండగా, భక్తజన బృందాలు చెక్కభజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా, కేరళ కళాకారుల వాయద్యాలు, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి ఉత్సవం కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు.

బ్రహ్మోత్సవాలలో ఐదో రోజు ఉదయం సకల లోక కల్యాణకారకుడు అయిన శ్రీ కల్యాణ వేంకటేశ్వరుడు దివ్యమోహినీ రూపంలో ఉత్సవమూర్తియై, తిరుచ్చిపై చిన్న కృష్ణుడు భక్తులను తన కృపాకటాక్షాలతో అనుగ్రహించారు. ఆ దివ్య మోహినీ మాయాశక్తికి వశమైన జగత్తు వాహ్య వాహకభేదాన్ని గుర్తుంచుకోలేకపోయింది. కనుక శ్రీవారు జగన్మోహినియై పల్లకీలో కూర్చొని ఉంటారు. ఈనాటి శ్రీవారి మోహినీ అవతారం భౌతికంగా జగన్మోహకత్వాన్నీ, ఆధ్యాత్మికంగా మాయాతీతశుద్ధ సత్త్వస్వరూప సాక్షాత్కారాన్ని ఏక సమయంలోనే సిద్ధింపజేస్తుంది.

కాగా సాయంత్రం 6.00 గంటల నుండి 7.00 గంటల వరకు ఊంజల్‌సేవ వైభవంగా జరగనుంది. రాత్రి 8.00 గంటల నుండి 10.00 గంటల వరకు విశేషమైన గరుడవాహనంపై స్వామివారు భక్తులకు దర్శనమివ్వనున్నారు.

శ్రీవారి బ్రహ్మోత్సవాలలో గరుడ వాహనోత్సవం అతి ముఖ్యమైనది. గరుడ వాహనంపై ఉన్న శ్రీవారిని దర్శిస్తే మోక్షం సిద్ధిస్తుందని భక్తుల నమ్మకం. వేదాలు, ఆచార్యులు గరుడుడిని వేదస్వరూపుడిగా పేర్కొన్నారు. గరుత్మంతుని రెక్కలు వేదం నిత్యత్వానికి, అపౌరుషషేయత్వానికి ప్రతీకలని స్తుతించారు. గరుడుని సేవాదృక్పథం, మాతృభక్తి, ప్రభుభక్తి, సత్యనిష్ఠ, నిష్కళంకత, ఉపకారగుణం సమాజానికి స్ఫూర్తిదాయకాలు. ఇందుకే గరుడసేవకు ఎనలేని ప్రచారం, ప్రభావం విశిష్టత ఏర్పడ్డాయి.

ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ ధ‌నంజ‌యులు, సహాయ కార్యనిర్వహణాధికారి శ్రీ ల‌క్ష్మ‌య్య‌, ప్రధాన కంకణబట్టార్‌ శ్రీ బాలాజీ రంగాచార్యులు, సూపరింటెండెంట్‌ శ్రీ చెంగ‌ల్రాయులు, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్ శ్రీ అనిల్‌, ఆలయ అర్చకులు, ఇతర అధికారులు, విశేష సంఖ్య‌లో భ‌క్తులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.