తిరుమలలో జనవరి 3న శ్రీవారి ప్రణయకలహోత్సవం

తిరుమలలో జనవరి 3న శ్రీవారి ప్రణయకలహోత్సవం

తిరుమల, 2018, జనవరి 01శ్రీవేంకటేశ్వరస్వామివారు తన దేవేరులతో పాల్గొనే కలహ శృంగారభరితమైన ప్రణయ కలహోత్సవం జనవరి 3వ తేదీన తిరుమలలో వైభవంగా జరుగనుంది.

ఈ ఉత్సవాన్ని పురస్కరించుకొని సాయంత్రం 4.00 గం||ల అనంతరం స్వామివారు, అమ్మవార్ల ఉత్సవమూర్తులు బంగారు పల్లకీలపై వేరువేరుగా వైభవోత్సవ మండపం నుండి ఊరేగింపుగా బయలుదేరి వరాహస్వామి ఆలయం చెంత ఒకరికొకరు ఎదురేగుతారు. ఇక్కడ అర్చకులు స్వామి, అమ్మవార్ల తరఫున వేరువేరుగా ఆళ్వారు దివ్యప్రబంధంలోని పాశురాలను స్తుతిస్తారు. ఆ తరువాత అమ్మవార్లు స్వామివారిని నిందాస్తుతి చేసిన అనంతరం ఒకరిపై ఒకరు పూబంతులను విసరడం, స్వామివారు పుష్పఘాతం నుండి తప్పించుకోవడం వంటి ఆసక్తికరమైన సన్నివేశాలతో ఈ ప్రణయకలహ మహోత్సవం ఘనంగా నిర్వహిస్తారు. ఈ సందర్భంగా వసంతోత్సవాన్ని టిటిడి రద్దు చేసింది. ఈ కార్యక్రమంలో టిటిడి ఉన్నతాధికారులు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొంటారు.

జనవరి 2న పౌర్ణమి గరుడసేవ రద్దు:

ప్రతినెలా పౌర్ణమినాడు నిర్వహించే శ్రీవారి గరుడసేవను జనవరి 2వ తేదీన టిటిడి రద్దు చేసింది. శ్రీవారి ఆలయంలో డిసెంబరు 18వ తేదీ నుండి అధ్యయనోత్సవాలు జరుగుతున్న విషయం విదితమే. ఈ కారణంగా మంగళవారం పౌర్ణమి గరుడసేవను రద్దు చేశారు. కాగా, వైకుంఠ ఏకాదశి, ద్వాదశి కారణంగా రద్దు చేసిన శ్రీవారి ఆర్జితసేవలు జనవరి 2వ తేదీ మంగళవారం నుంచి యథావిధిగా జరుగనున్నాయి.

తి.తి.దే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.