KALYANA VENKANNA THRILLS DEVOTEES ON RATHOTSAVAM_ భక్తుల మనోరథాన్ని అధిరోహించిన దేవదేవుడు

Tirupati, 13 February 2018: On Day 8, the penultimate day of Annual Brahmotsavam at Sri Kalyana Venkateswara Swamy Temple, Srinivasa Mangapuram, Lord Venkanna rode on colorfully flower decorated Ratham and thrilled the devotees.

Puranic lores say that Ratham was the embodiment of five elements of Body, soul, Brain, heart, and stamina (indriyas). Later in the evening the utsava deities will be given Unal seva and Ashwa vacant procession at night.

Vedic scripts symbolize Aswa (horse) with five elements of the body whose domination enhanced Moksha and Karyasiddhi in life. Lord Venkanna on the Ashwa vahanam signified domination of Indriyas for success in achieving life goals.

The TTD cultural wing, HDPP organized kolatas and chakka bhajans of teams from Mallayyapalli in Chandragiri mandal, and 100 artistes from Rajahmundry and Kerala drums.

CVSO Sri Ake Ravikrishna, Addl CVSO Sri Sivakumar Reddy, SE Sri Ramesh Reddy, Local temples DyEO Sri Venkataiah, AEO Sri Srinivasulu, Kakanabhattar Sri Balaji Rangacharyulu, AE Sri Nagaraju and a large number of devotees.

CHAKRASNANAM ON FEB 14

On last day of the ongoing Brahmotsavam, Wednesday colorful Chakrasnanam will be performed after a Snapana Thirumanjanam. Chakrathalwar will be immersed in the holy waters of the new pushkarini of the Sri KVS Temple.


ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

భక్తుల మనోరథాన్ని అధిరోహించిన దేవదేవుడు

తిరుపతి,2018 ఫిబ్రవరి 13: శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో ఎనిమిదో రోజైన మంగళవారం ఉదయం శ్రీనివాసుడు రథాన్ని అధిరోహించి భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం 8.15 నుండి 9.15 గంటల వరకు ఉభయదేవేరులతో కూడి శ్రీవారు రథోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి రథాన్ని లాగారు. భక్తజన బృందాలు చెక్కభజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి ఉత్సవం కోలాహలంగా జరిగింది. భక్తులు కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు.

బ్రహ్మోత్సవాలలో ఎనిమిదో రోజు ఉదయం రథోత్సవం జరుగుతుంది. శరీరం – రథం, ఆత్మ- రథికుడు, బుద్ధి – సారథి, మనస్సు – పగ్గాలు, ఇంద్రియాలు – గుర్రాలు. ఇంద్రియ విషయాలు రథం నడిచే త్రోవలు. రథం రథికుణ్ణి చూడమంటుంది. రథికుడు పగ్గాల సాయంతో గుర్రాలను అదిలిస్తూ, దారుల వెంబడి పరుగులు తీయించినట్లే ఇంద్రియాలతో, మనస్సుతో కూడిన ఆత్మవిషయాల్ని అనుభవిస్తూ ఉంటుంది. రథోత్సవం ఒక ఉత్సవం మాత్రమే కాదు. భక్తుల హృదయక్షేత్రాలలో తాత్త్వికబీజాలు విత్తే ఒక యజ్ఞం. సింగారించిన స్వామివారి రథాన్ని దర్శించిన వారికి జన్మాదిదుఃఖాలు నశించి, మోక్షం లభిస్తుంది. రథస్తుడైన మాధవుడిని దర్శిస్తే పునర్జన్మ ఉండదన్నారు పెద్దలు.

అనంతరం సాయంత్రం 6.00 గంటల నుండి 7.00 గంటల వరకు ఊంజల్‌ సేవ వైభవంగా జరగనుంది. రాత్రి 8.00 గంటల నుండి 9.00 గంటల వరకు అశ్వ వాహనంపై స్వామివారు భక్తులకు దర్శనమివ్వనున్నారు.

అశ్వ వాహనం :

ఉపనిషత్తులు ఇంద్రియాలను గుర్రాలుగా వర్ణిస్తున్నాయి. అందువల్ల అశ్వాన్ని అధిరోహించిన పరమాత్మ ఇంద్రియాలను నియమించే నియామకుడు. పరమాత్మను అశ్వస్వరూపంగా కృష్ణయజుర్వేదం తెలియజేసింది. స్వామి అశ్వ వాహనాధిరూఢడై భక్తులకు దర్శనమిచ్చి తద్వారా తన కల్కి స్వరూపాన్ని ప్రకటిస్తూ కలిదోషాలకు దూరంగా ఉండమని నామసంకీర్తనాద్యుపాయాలను ఆశ్రయించి తరించమని ప్రబోధిస్తున్నాడు.

రథోత్సవం సందర్భంగా టిటిడి హిందూ ధర్మ ప్రచార పరిషత్‌ ఆధ్వర్యంలో చంద్రగిరి మండలం మల్లయ్యపల్లికి చెందిన కళాకారుల కోలాటాలు, రాజమండ్రికి చెందిన 100 మంది కళాకారుల పండరి భజనలు, చెక్కభజనలు, కోలాటాలు భక్తులను విశేషంగా అకట్టుకుంటున్నాయి. ఇందులో చిన్న పిల్లలు భజనలు, కేరళ వాయిద్యాలు శ్రీవారి రథోత్సవంలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి.

ఈ కార్యక్రమంలో టిటిడి సివిఎస్వో శ్రీ ఆకే రవికృష్ణ, అదనపు సివిఎస్వో శ్రీ శివకుమార్‌రెడ్డి, ఎస్‌ఇ శ్రీ రమేష్‌రెడ్డి, స్థానిక ఆలయాల ఉపకార్యనిర్వహణాధికారి శ్రీ వెంకటయ్య, సహాయ కార్యనిర్వహణాధికారి శ్రీ శ్రీనివాసులు, ప్రధాన కంకణబట్టార్‌ శ్రీబాలాజీ రంగాచార్యులు, ఏఈ శ్రీ నాగరాజు, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

ఫిబ్రవరి 14న చక్రస్నానం :

శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా చివరిరోజైన బుధవారం ఉదయం చక్రస్నానం వైభవంగా జరుగనుంది. ఇందులో భాగంగా ఉదయం 8.30 నుండి 10.00 గంటల వరకు వేడుకగా స్నపనతిరుమంజనం నిర్వహిస్తారు. అనంతరం 10.00 గంటల వరకు ఆలయం ఎదురుగా గల నూతన పుష్కరిణిలో చక్రత్తాళ్వార్‌కు శాస్త్రోక్తంగా చక్రస్నానం జరుగనుంది.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.