SRI PRASANNA VENKATESWARA SWAMY TEMPLE BRAHMOTSAVAM CONCLUDES WITH CHAKRASNANAM _ ఘనంగా ముగిసిన శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలు
ఘనంగా ముగిసిన శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలు
తిరుపతి, జూన్ 26, 2013: అప్పలాయగుంటలోని శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో తొమ్మిది రోజుల పాటు జరిగిన బ్రహ్మోత్సవాలు బుధవారం ధ్వజావరోహణంతో వైభవంగా ముగిశాయి.
ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపిన అనంతరం పల్లకీ ఉత్సవం, చూర్ణాభిషేకం నిర్వహించారు. ఆ తరువాత స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనం వేడుకగా చేపట్టారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, పసుపు, చందనం, పలు రకాల పండ్ల రసాలతో అభిషేకం చేశారు. ఉదయం 9.45 గంటలకు ఆలయం ఎదురుగా గల స్వామివారి పుష్కరిణిలో చక్రత్తాళ్వార్కు చక్రస్నానం నిర్వహించారు. పెద్ద సంఖ్యలో హాజరైన భక్తులు పుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరించారు.
సాయంత్రం 6.00 నుండి 7.00 గంటల వరకు నవసంధి, మాడవీధి ఉత్సవం నిర్వహించారు. అనంతరం ధ్వజావరోహణంతో బ్రహ్మోత్సవాలు ఘనంగా ముగిశాయి. కాగా బ్రహ్మోత్సవాల్లో చేపట్టిన విద్యుద్దీపాలంకరణలు, పుష్పాలంకరణలు, సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను ఆకట్టుకున్నాయి. మధ్యాహ్నం, రాత్రి వేళల్లో భక్తులకు ఉచితంగా అన్నప్రసాద వితరణ చేశారు. ఆలయం ఎదురుగా ఏర్పాటుచేసిన పుస్తక విక్రయశాల, ఆయుర్వేద, ప్రథమ చికిత్స శిబిరాలకు భక్తుల నుండి అపూర్వ స్పందన లభించింది.
ఈ కార్యక్రమంలో తితిదే స్థానిక ఆలయాల ఉప కార్యనిర్వహణాధికారి శ్రీ భాస్కర్రెడ్డి, తితిదే వైఖానస ఆగమ సలహాదారులు శ్రీ వేదాంతం విష్ణుభట్టాచార్యులు, విజిఓ శ్రీ హనుమంతు, సహాయ కార్యనిర్వహణాధికారి శ్రీమతి నాగరత్న, సూపరింటెండెంట్ శ్రీ పీతాంబర రాజు, టెంపుల్ ఇన్స్పెక్టర్ శ్రీ శ్రీనివాసులు, ఆలయ అర్చకులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.