THREE DAY ANNUAL JYESTHABHISHEKAM BEGINS SRI GOVINDARAJA SWAMY TEMPLE _ శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో ఘనంగా జ్యేష్టాభిషేకం
శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో ఘనంగా జ్యేష్టాభిషేకం
తిరుపతి, జూలై 18, 2013: తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో గురువారం జ్యేష్టాభిషేకం ఘనంగా ప్రారంభమైంది. మూడు రోజుల పాటు జరుగనున్న ఈ ఉత్సవంలో మొదటిరోజు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి విశ్వరూప దర్శనం కల్పించారు. అనంతరం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీవారు కళ్యాణమండపంలోకి వేంచేపు చేశారు. అక్కడ శతకలశ స్నపనం, మహాశాంతిహోమం, తిరుమంజనం, సమర్పణ, ఆరగింపు, అక్షతారోహణం, బ్రహ్మోఘోష నిర్వహించారు. మధ్యాహ్నం స్వామి, అమ్మవార్లకు విశేష సమర్పణ చేశారు. సాయంత్రం 5.30 గంటల నుండి 6.30 గంటల వరకు ఉభయనాంచారులతో కలసి శ్రీవారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగి భక్తులకు దర్శనభాగ్యం కల్పించనున్నారు.
ఈ కార్యక్రమంలో తితిదే స్థానిక ఆలయాల ఉపకార్యనిర్వహణాధికారి శ్రీ చంథ్రేఖరపిళ్లై, సహాయ కార్యనిర్వహణాధికారి శ్రీ ప్రసాదమూర్తిరాజు, సూపరింటెండెంట్ శ్రీ సుధాకర్ బాబు, టెంపుల్ ఇన్స్పెక్టర్ శ్రీ పి.ఎస్.బాలాజీ ఇతర అధికారులు, విశేషసంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
జూలై 20న శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో తులసి మహత్యం ఉత్సవం
తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో జూలై 20వ తేదీ శనివారం తులసి మహత్యం ఉత్సవం ఘనంగా జరుగనుంది. స్వామివారికి తులసి దళం అత్యంత ప్రీతికరమైనది. శ్రావణ శుద్ధ ద్వాదశినాడు తులసి ఆవిర్భావం జరిగిన సందర్భాన్ని పురస్కరించుకుని ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా ఉదయం 7.00 గంటలకు శ్రీ గోవిందరాజస్వామివారు గరుడ వాహనాన్ని అధిరోహించి ఆలయ నాలుగు మాడ వీధుల్లో భక్తులకు దర్శనమిస్తారు. అంతకుముందు స్వామివారిని బంగారు తిరుచ్చిపై వేంచేపు చేసి బంగారు వాకిలి వద్ద తులసి మహత్యం ఆస్థానం జరుగనుంది. ఇందులో అర్చకులు తులసి మహత్యం పురాణ పఠనం చేస్తారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందజేస్తారు.
ఈ ఉత్సవాన్ని 900 సంవత్సరాల క్రితం శ్రీ రామానుజాచార్యుల వారు శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో ప్రవేశపెట్టారని, అప్పటి నుండి నిరంతరాయంగా కొనసాగుతోందని అర్చకులు తెలిపారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.