THREE DAY ANNUAL JYESTHABHISHEKAM CONCLUDES _ తిరుమలలో ముగిసిన అభిద్యేయక జ్యేష్ఠాభిషేకం
తిరుమలలో ముగిసిన అభిద్యేయక జ్యేష్ఠాభిషేకం
తిరుమల, జూన్ 22, 2013: తిరుమల శ్రీవారి ఆలయంలో మూడు రోజుల పాటు నిర్వహించిన జ్యేష్ఠాభిషేకం శనివారం ఘనంగా ముగిసింది. తరతరాలుగా అభిషేకాదులతో అత్యంత ప్రాచీనములైన శ్రీ స్వామివారి ఉత్సవమూర్తులు అరిగిపోకుండా పరిరక్షించే నిమిత్తం ఈ ఉత్సవాన్ని ప్రతి ఏటా నిర్వహిస్తారు.
కాగా చివరి రోజు ఉదయం స్నపనతిరుమంజనం నిర్వహించారు. ఇందులో భాగంగా పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపు, పలు రకాల పండ్ల రసాలతో అభిషేకం చేశారు. అనంతరం స్వామివారికి బంగారు కవచం సమర్పించి ఊరేగింపు నిర్వహించారు. ఈ బంగారు కవచాన్ని మళ్లీ జ్యేష్ఠాభిషేకంలోనే తీస్తారు. అంతవరకు సంవత్సరం పొడవునా స్వామివారి ఇదే కవచంతోనే ఉంటారు.
జ్యేష్ఠాభిషేకం కారణంగా ఆలయంలో కల్యాణోత్సవం, ఊంజల్సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, వసంతోత్సవాలను తితిదే రద్దు చేసింది. ఈ కార్యక్రమంలో తితిదే ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
జూన్ 23న పౌర్ణమి గరుడ సేవ
ప్రతినెలా పౌర్ణమిరోజు నిర్వహించే పౌర్ణమి గరుడ సేవ ఆదివారం ఘనంగా జరుగనుంది. రాత్రి 7.00 నుండి 9.00 గంటల వరకు శ్రీ మలయప్పస్వామివారు గరుడ వాహనాన్ని అధిరోహించి నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిస్తారు.