TIRUVADIPURAM-PURASAITOTOTSAVAM PERFORMED IN TIRUMALA _ తిరుమలలో ఘనంగా తిరువాడిపురం మరియు పురుశైతోట ఉత్సవం
తిరుమలలో ఘనంగా తిరువాడిపురం మరియు పురుశైతోట ఉత్సవం
తిరుమల, 09 ఆగష్టు 2013: తిరుమలలో శుక్రవారంనాడు ఆండాళ్ శ్రీగోదాదేవి పుట్టినరోజు పర్వదినాన్ని పురస్కరించుకొని తిరువాడిపురం ఉత్సవాన్ని, అదే విధంగా ఇదే రోజు శ్రీ వైష్ణవ భక్తాగ్రేసరుల్లో ప్రముఖుడైన శ్రీ అనంతాళ్వారు స్వామివారిలో ఐక్యం చెందిన పర్వదినాన్ని పురస్కరించుకొని పురుశైవారి తోటాత్సవాన్ని తి.తి.దే ఘనంగా నిర్వహించింది.
ఈ నేపథ్యంలో తిరుమల శ్రీవారి ఆలయంలో ఉదయం ఆండాళ్ శాత్తుమొర కార్యక్రమం వైభవంగా జరిగింది.
ఇక చారిత్రక నేపథ్యం గమనిస్తే శ్రీ అనంతాళ్వానులు క్రీ.శ 1053 సంవత్సరంలో మైసూరు సమీపములోని శిరుపుత్తూరు అను దివ్యక్షేత్రంలో జన్మించిరి. వీరి తండ్రి నామధేయము శ్రీ కేశవాచార్యులు. గురువుగారైన శ్రీ రామానుజాచార్యుల కన్న 36 ఏండ్లు చిన్న. తిరుమలలో 102 ఏండ్లు పుష్పకైంకర్యమునకు అంకితమై చివరకు ఆడిమాసం (కర్కాటకనెల బృందావనగ్రస్థులైన శ్రీ అనంతాళ్వానుల సమాధి నుండి ”పొగడమానుగా” ఉద్భవించినారని చరిత్ర చెబుతున్నది).
శుక్రవారం సాయంత్రం 6.00 గంటలకు శ్రీ అనంతళ్వార్ల సేవను స్మరిస్తూ, సత్కరించడానికి అన్నట్లుగా శ్రీ మలయప్పస్వామి ఉభయదేవేరులతో కూడి ఛత్ర, చామర, మంగళవాద్య పురస్కరంగా మాహాప్రదక్షిణ మార్గంలో (ప్రదక్షణంగా) ఊరేగుతూ శ్రీ అనంతాళ్వార్ల తోటకు వేంచేపుచేసారు. అనంతరం బృందావన సమీపంలో పొగడమానుగా ఉద్భవించిన శ్రీ అనంతాళ్వార్లకి పూజా, నివేదన, హారుతులైన తర్వాత శ్రీ మలయప్ప స్వామివారు పూలమాలలను పొగడమానుకు సమర్పించి శఠారితో సత్కరించారు. పిదప మిగిలిన ప్రదక్షిణ మార్గంలో శ్రీస్వామివారు ఊరేగుతూ ఆలయంలో ప్రవేశించారు.
ఈ కార్యక్రమంలో తిరుమల జె.ఇ.ఓ శ్రీ కె.ఎస్. శ్రీనివాసరాజు, ఆలయ డిప్యూటి.ఇ.ఓ శ్రీ చిన్నంగారి రమణ, అనంతాళ్వాన్ వంశీకులు తదితరులు పాల్గొన్నారు.
తి.తి.దే ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.