టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్‌ ఆధ్వర్యంలో తెలుగు రాష్ట్రాల్లో మార్చి 18న ఉగాది, 25న శ్రీరామనవమి

టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్‌ ఆధ్వర్యంలో తెలుగు రాష్ట్రాల్లో మార్చి 18న ఉగాది, 25న శ్రీరామనవమి

మార్చి 17, తిరుపతి, 2018: టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్‌ ఆధ్వర్యంలో మనగుడి కార్యక్రమంలో భాగంగా మార్చి 18న ఉగాది, మార్చి 25న శ్రీరామనవమి వేడుకలను తెలుగు రాష్ట్రాల్లోని అన్ని జిల్లా కేంద్రాల్లో నిర్వహించనున్నారు.

ఉగాది సందర్భంగా పంచాంగ శ్రవణం వినిపించడంతోపాటు ఉగాది పచ్చడి పంపిణీ చేస్తారు. మార్చి 25న శ్రీరామనవమి సందర్భంగా ఎస్‌సి, ఎస్‌టి, బిసి కాలనీల్లోని రామాలయాల్లో ఏడు రోజుల పాటు ప్రముఖ పండితులు ” శ్రీరామనవమి విశిష్టత, శ్రీరాముడు ధర్మస్వరూపుడు, సీతా చరిత్ర, సేవాధర్మం, రామాయణం ఇంటింటి కథ, శ్రీరామరాజ్యం, రామాయణం జాతికి సందేశం” అంశాలపై ధార్మికోపన్యాసాలు చేస్తారు.

వీటితోపాటు హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్టు ఆధ్వర్యంలో రాష్ట్రంలోని ఎస్‌సి, ఎస్‌టి, మత్స్యకార ప్రాంతాల్లో నూతనంగా నిర్మించిన రామాలయాల్లో శ్రీరామనవమి పర్వదినాన్ని నిర్వహిస్తారు. టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్‌ కార్యదర్శి శ్రీ ఎ.రామకృష్ణారెడ్డి ఈ కార్యక్రమాల ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.