ఏప్రిల్ 14న శ్రీ వేదనారాయణస్వామివారి ఆలయంలో మత్స్య జయంతి

ఏప్రిల్ 14న శ్రీ వేదనారాయణస్వామివారి ఆలయంలో మత్స్య జయంతి

తిరుపతి, 2021 ఏప్రిల్ 12: నాగలాపురంలోని శ్రీ వేదనారాయణస్వామివారి ఆలయంలో ఏప్రిల్ 14వ తేదీన మత్స్య జయంతి ఏకాంతంగా జరుగనుంది. కోవిడ్ – 19 నిబంధ‌న‌ల మేర‌కు ఆల‌యంలో ఈ ఉత్స‌వాన్ని ఏకాంతంగా నిర్వ‌హిస్తారు.

శ్రీమహావిష్ణువు వేదాలను రక్షించేందుకు లోకకల్యాణం కోసం మత్స్యావతారంలో స్వయంభువుగా వెలిసిన రోజును మత్స్య జయంతిగా పిలుస్తారు. ఈ రోజున మత్స్యావతార వేదనారాయణస్వామివారిని దర్శించుకున్న భక్తులకు మనశ్శాంతి, నవగ్రహశాంతి, కల్యాణసౌభాగ్యం, భోగభాగ్యాలు కలుగుతాయని ప్రతీతి.

ఈ సందర్భంగా ఉదయం 6 గంటలకు సుప్రభాతంతో స్వామివారి మేల్కొల్పి తోమాల, అర్చన అనంతరం 6.30 నుండి 7.30 గంటల వరకు ఆల‌యంలో తిరుచ్చి ఉత్సవం నిర్వహిస్తారు. ఉదయం 8.30 నుండి 10.30 గంటల వరకు శాంతిహోమం, ఉద‌యం 11 నుండి మ‌ధ్యాహ్నం 12 గంట‌ల వ‌ర‌కు స్నపన తిరుమంజనం చేపడతారు. సాయంత్రం 6.30 నుండి రాత్రి 8 గంటల వరకు ఆల‌యంలో గరుడ వాహనంపై స్వామివారిని వేంచేపు చేస్తారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.