ఘనంగా అన్నమయ్య దినము ద్వాదశి

ఘనంగా అన్నమయ్య దినము ద్వాదశి

తిరుపతి, ఫిబ్రవరి 07, 2013: పరమపవిత్రమైన ద్వాదశి తిథినాడు పదకవితా పితామహుడు శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల వారు శ్రీవారిలో ఐక్యమైన మహత్తర సందర్భాన్ని పురస్కరించుకుని తితిదే గురువారం నాడు తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో ‘అన్నమయ్య దినము ద్వాదశి’ని ఘనంగా నిర్వహించింది. ఈ సందర్భంగా ఉదయం 9.30 గంటలకు దినము ద్వాదశి సంకీర్తనలతో అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు గోష్టిగానం నిర్వహించారు. ఉదయం 10.30 గంటలకు అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారుడు శ్రీ జి.చంథ్రేఖర్‌ భాగవతార్‌ ”మహాకవి కాళిదాసు” అనే  హరికథా పారాయణం చేశారు. మధ్యాహ్నం భక్తులకు అన్నప్రసాద వితరణ జరిగింది.
సాయంత్రం గుంటూరుకు చెందిన డాక్టర్‌ టి.నిర్మల ”అన్నమయ్య దర్శించిన శ్రీ వేంకటేశ్వరుడు” అనే అంశంపై ఉపన్యసించారు. అనంతరం మైసూరుకు చెందిన డాక్టర్‌ జి.రంగస్వామి బృందం సంగీత సభ నిర్వహించింది. ఈ కార్యక్రమంలో అన్నమాచార్య ప్రాజెక్టు సంచాలకులు డాక్టర్‌ మేడసాని మోహన్‌, ప్రోగ్రాం కో-ఆర్డినేటర్‌ డాక్టర్‌ కె.వాణి, ఇతర అధికారులు, విశేషసంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
             
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.