మే 24, 25వ తేదీల్లో తిరుమలలో తరిగొండ వెంగమాంబ 283వ జయంతి ఉత్సవాలు

మే 24, 25వ తేదీల్లో తిరుమలలో తరిగొండ వెంగమాంబ 283వ జయంతి ఉత్సవాలు

తిరుమల, మే 22, 2013: శ్రీ వేంకటేశ్వరస్వామికి అపర భక్తురాలైన మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ 283వ జయంతి ఉత్సవాలు మే 24, 25వ తేదీల్లో తిరుమల, తిరుపతి, తరిగొండలో ఘనంగా జరుగనున్నాయి.
తిరుమలలో మే 25వ తేదీన ఉదయం 8.00 గంటలకు శ్రీవారు ఉభయదేవేరులతో కలిసి తిరుమల మాడవీధుల గుండా నారాయణగిరి ఉద్యానవనాల్లోని పద్మావతి పరిణయ మండపానికి ఊరేగింపుగా వెళ్తారు. అక్కడ శ్రీనివాసమంగాపురం వశిష్టాశ్రమ పీఠాధిపతులు శ్రీశ్రీశ్రీ స్వస్వరూపానందగిరి స్వామివారి అనుగ్రహభాషణం చేస్తారు. అనంతరం తితిదే అన్నమాచార్య ప్రాజెక్టు, ఎస్వీ సంగీత, నృత్య కళాశాల కళాకారులు గోష్టిగానం నిర్వహిస్తారు. ఉదయం 10.30 గంటలకు తరిగొండ వెంగమాంబ బృందావనంలో పుష్పాంజలి సమర్పిస్తారు.
తరిగొండ వెంగమాంబ క్రీ.శ 1730వ సంవత్సరంలో చిత్తూరు జిల్లా వాయల్పాడు సమీపంలోని తరిగొండ గ్రామంలో కానాల మంగమాంబ, కానాల కృష్ణయామాత్యులు దంపతు లకు  జన్మించారు. శ్రీ వేంకటేశ్వరుని దయవల్ల కలిగిన సంతానం కావున ఈమెకు ‘వెంగమాంబ’ అని పేరు పెట్టారు. ఈమెకు పదేళ్ల వయసులోనే ఇంజేటి వేంకటాచలపతి అనే వ్యక్తితో బాల్య వివాహం జరిగింది. వివాహమైన కొన్నాళ్లకే భర్త వియోగం ఏర్పడింది. అయినా శ్రీ వేంకటేశ్వరుడే తన భర్త అని ప్రకటించి వెంగమాంబ ముత్తయిదువు చిహ్నాలు ధరించే ఉండేవారు. మదనపల్లికి చెందిన రూపావతారం సుబ్రహ్మణ్యయోగి వద్ద ఆధ్యాత్మిక విద్య, యోగవిద్య ఉపదేశం పొందారు. కొద్దికాలానికే ఆ విద్యల్లో ఎంతో అనుభవం సాధించారు. ఆధ్యాత్మిక, భక్తి, యోగ విషయాలకు సంబంధించి తరిగొండలో 5, తిరుమలలో 13 పుస్తకాలు రాశారు. ఇందులో యక్షగానాలు, సంకీర్తనలు, స్తోత్రాలు, పద్యరచనలు, ద్విపదరచనలు ఉన్నాయి.
వెంగమాంబ తిరుమల శ్రీవారి ఆలయంలో ఏకాంతసేవలో ”ముత్యాలహారతి” అనే విశిష్ట నిత్యకైంకర్యాన్ని నెలకొల్పారు. ఈ సేవ నేటికీ అవిచ్ఛిన్నంగా జరుగుతూనే ఉంది. తాళ్లపాక అన్నమాచార్యుల వారిని ప్రస్తుతించిన ఏకైక కవయిత్రి వెంగమాంబ కావడం విశేషం. క్రీ.శ. 1817వ సంవత్సరంలో తిరుమల పుణ్యక్షేత్రంలో శ్రీ వేంకటేశ్వరున్ని స్మరిస్తూ వెంగమాంబ సజీవసమాధి చెందారు.
            
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.