సెప్టెంబరు 17 నుండి శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో పవిత్రోత్సవాలు

సెప్టెంబరు 17 నుండి శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో పవిత్రోత్సవాలు

తిరుపతి, సెప్టెంబరు 16, 2013: తిరుచానూరులోని శ్రీపద్మావతి అమ్మవారి ఆలయంలో సెప్టెంబరు 17వ తేదీ నుండి 19వ తేదీ వరకు మూడు రోజుల పాటు పవిత్రోత్సవాలు వైభవంగా జరుగనున్నాయి. ఈ ఉత్సవాలకు సోమవారం ఘనంగా అంకురార్పణం జరిగింది.

వైదిక సంప్రదాయం ప్రకారం జాతాశౌచం, మృతాశౌచం వంటి వేళల్లో ఆలయ ప్రవేశం నిషిద్ధం. అయినా యాత్రీకుల వల్లగానీ, సిబ్బంది వల్ల గానీ తెలిసీతెలియక ఇటువంటి దోషాలు జరుగుతుంటాయి. ఇలాంటి వాటివల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రానీయకుండా నివారించేందుకు ప్రతి ఏడాదీ మూడు రోజుల పాటు పవిత్రోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ. ఈ పవిత్రోత్సవాలలో ఆలయ శుద్ధి, పుణ్యాహవచనం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు.

ఈ సందర్భంగా సెప్టెంబరు 17వ తేదీన పవిత్రప్రతిష్ఠ, 18వ తేదీన పవిత్ర సమర్పణ, 19వ తేదీన పూర్ణాహుతి కార్యక్రమాలు జరుగనున్నాయి. రూ.750/- చెల్లించి గృహస్తులు (ఒకరికి మూడు రోజులపాటు) ఈ పవిత్రోత్సవాల ఆర్జిత సేవలో పాల్గొనవచ్చు. గృహస్తులకు 2 లడ్డూలు, 2 వడలు బహుమానంగా అందజేస్తారు.

పవిత్రోత్సవాల  సందర్భంగా సెప్టెంబరు 16వ తేదీ సోమవారం కళ్యాణోత్సవం, అష్టదళ పాదపద్మారాధన మరియు ఊంజల్‌సేవ, సెప్టెంబరు 17వ తేదీ మంగళవారం కళ్యాణోత్సవం మరియు ఊంజల్‌సేవలను రద్దు చేయనున్నారు.సెప్టెంబరు 18వ తేదీన బుధవారం కళ్యాణోత్సవం మరియు ఊంజల్‌సేవ, సెప్టెంబరు 19వ తేదీన గురువారం కళ్యాణోత్సవం, తిరుప్పావడ సేవ మరియు ఊంజల్‌సేవ ఆర్జిత సేవలను రద్దు చేశారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.